శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (08:05 IST)

ప్రశ్నించిన పాపానికి కరెంటు స్తంభానికి కట్టేసి... వీపు వాచేలా కొట్టారు..!

అతడు నిస్సహాయుడు... అండదండలు అంతగా లేవు. ఎదుటి వారిని నిలవరించే శక్తి లేదు. ఎందుకిలా చేస్తున్నారు? భయపడుతూ.. భయపడుతూ..ప్రశ్నించిన పాపానికి, అదేదో నేరస్థుడిని కొట్టినట్లు కరెండు స్తంభానికి కట్టేసి చితకబాదారు. వీపు చిట్లిపోయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.  
 
శ్రీకాళహస్తి మండలంలోని కోదండరామాపురం గ్రామంలో మునిస్వామిరెడ్డి, బక్కారెడ్డి కుటుంబాలకు ముడేళ్లుగా గొడవలున్నాయి. మునిస్వామి రెడ్డి పెద్దగా బలం, బంధువర్గం ఉన్న వాడు కాదు. ఈ నేపథ్యంలో మునిస్వామి రెడ్డి(27)కి వస్తున్న పెళ్లి సంబంధాలు అన్నీ తప్పిపోతూ ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన మునిస్వామి రెడ్డి ఈ విషయంపై శనివారం బక్కారెడ్డి కుటుంబసభ్యులను ప్రశ్నించాడు.
 
దీంతో బక్కారెడ్డి వర్గం రెచ్చిపోయింది. బక్కారెడ్డితో పాటు భూపతి, దయాకర్, మోహన్, కౌసల్యలు కలిసి మునిస్వామి రెడ్డిని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. వీపు పగిలిపోయింది. పెద్ద పెద్ద గాయాలయ్యాయి. అతడిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియూ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే, పోలీసులు బక్కారెడ్డి పలుకుబడితో మునిస్వామి రెడ్డిపై కూడా కేసు నమోదు చేయడం విశేషం.