శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: బుధవారం, 28 సెప్టెంబరు 2016 (17:30 IST)

తిరుపతిలో దోమల దండయాత్ర... డంపింగ్ యార్డు మురికి కంపు...

ఆధ్మాత్మిక నగరం తిరుపతి నడిబొడ్డున మురికి కూపం జనాలను భయపెడుతోంది. ఎపిలోనే మూడవ అతిపెద్ద నగరంగా తిరుపతి అభివృద్ధి చెందుతున్నా పారిశుధ్యంలో మాత్రం ఆ జాడలు కనిపించడం లేదు. నగరంలో సేకరించిన చెత్తనంతా ఊరి బయట వేయాల్సిన అధికారులు నడిబొడ్డున నిలువ చేస్తూ ప

ఆధ్మాత్మిక నగరం తిరుపతి నడిబొడ్డున మురికి కూపం జనాలను భయపెడుతోంది. ఎపిలోనే మూడవ అతిపెద్ద నగరంగా తిరుపతి అభివృద్ధి చెందుతున్నా పారిశుధ్యంలో మాత్రం ఆ జాడలు కనిపించడం లేదు. నగరంలో సేకరించిన చెత్తనంతా ఊరి బయట వేయాల్సిన అధికారులు నడిబొడ్డున నిలువ చేస్తూ ప్రాణాలను నిలువునా తీసేస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.
 
తిరుపతి.. పేరు గొప్పా.. ఊరు దిబ్బ చందంగా తయారైంది. పేరుకు పెద్ద నగరమనే కానీ వసతుల్లో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. తాగునీటి నుంచి పారిశుధ్యం వరకు ప్రతి సమస్య ఇప్పటికీ తిరుపతి వాసులను వెంటాడుతూ ఉంది. అందులో నాయకుల తీరు కొంత ఉంది. అధికారుల నిర్లక్ష్యం మరికొంత తోడైంది. సీజనల్‌ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలంటే దోమలపై దండయాత్ర పేరుతో ఒకవైపు ప్రభుత్వం హంగామా చేస్తుంటే అదే దోమకాటుకు గురై తిరుపతి నగరంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీన్నిబట్టే అర్థమవుతుంది. ఇక్కడి పారిశుధ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. 
 
తిరుపతిలోని చేపల మార్కెట్‌ పక్కన ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక డంపింగ్‌ యార్డు చాలాకాలం నుంచి నాలుగు కాలనీల వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఎప్పటికప్పుడు దానిని తరలిస్తూ ఉంటే ఫర్వాలేదు కానీ రెండుమూడు రోజులు అలాగే ఉంచితే మాత్రం ఆ కాలనీ వాసులు ఇళ్ళలో కూడా ఉండలేని పరిస్థితి ఎదురవుతోంది. 
 
విపరీతమైన కంపుకొడుతూ భయంకరంగా దోమలు దండయాత్ర చేస్తుండటంతో ఎప్పుడు ఏ వ్యాధులు వస్తాయోనన్న భయంతో అల్లాడిపోతున్నారు. దీనిపై స్థానికంగా ఉండే ప్రజలు పోరాటానికి దిగారు. వెంటనే డంపింగ్‌ యార్డును తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవైపు వేలకోట్ల రూపాయలు ఆదాయం వస్తూ మరొక వైపు టిటిడి సహాయం అందుతున్నా ఇలాంటి చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉంది తిరుపతి నగర పాలక సంస్థ. చాలాకాలంగా ఎన్నికలు జరుగకపోవడం అధికారులకు జవాబుదారీతనం లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఇప్పటికైనా తిరుపతివాసుల మొరను పట్టించుకుంటారని ఆశిద్దాం.