శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 25 జులై 2017 (04:06 IST)

సినీ ఇండస్ట్రీకి భారీ షాక్‌.. ఆ కుటుంబంలోని ఇద్దరు కుర్ర హీరోలకూ, హీరోయిన్‌కు కూడా త్వరలో నోటీసులు

తెలుగు చిత్రపరిశ్రమకు మరో భారీ షాక్ తప్పేట్లా లేదు. సినీ పరిశ్రమలో తొలి నుంచీ హవా సాగిస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారికి కూడా మాదకద్రవ్యాల వినియోగంతో లింకులున్నాయని తెలుసుకున్న సిట్ నివ్వెరపోయింది.

తెలుగు చిత్రపరిశ్రమకు మరో భారీ షాక్ తప్పేట్లా లేదు. సినీ పరిశ్రమలో తొలి నుంచీ హవా సాగిస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారికి కూడా మాదకద్రవ్యాల వినియోగంతో లింకులున్నాయని తెలుసుకున్న సిట్ నివ్వెరపోయింది. మేం మాత్రమే ఇరుక్కుంటే మాకేం లాభం అనే విధంగా విచారణకు రోజుకొక్కరుగా హాజరవుతున్న సినీ నటులు డ్రగ్స్ వినియోగిస్తున్న పెద్ద చేపల పేర్లు కూడా వెల్లడిస్తుండటంతో బడా కుటుంబాల హీరోలకు, అగ్ర హీరోయిన్లకు కూడా చెమటలు పడుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్న సుబ్బరాజు, శ్యాం కె.నాయుడు ఈ డ్రగ్స్ వినియోగంలో పాత్ర ఉన్న బడా హీరోలు, హీరోయిన్ల పేర్లను వరుసగా చెప్పేశారని స్పష్టంగా తెలుస్తోంది. టాప్‌ పొజిషన్‌లో ఉన్న ఇద్దరు కుర్ర హీరోలూ, సినీ పరిశ్రమలో తొలి నుంచి హవా సాగిస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారికీ లింకులు, టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఓ ప్రముఖ తార కూడా మాదకద్రవ్యాలను పీల్చేస్తున్నారని చెప్పేశారు. దీంతో ఇప్పటివరకు 12 మందికి నోటీ సులిచ్చి విచారణ జరుపుతున్న అధికారులు మరో జాబితా సిద్ధం చేశారు. త్వరలోనే కొత్త జాబితాలో చేర్చినవారిని కూడా విచారణకు పిలిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
సినీ పరిశ్రమలో మొదట్నుంచీ తమ హవా కొనసాగిస్తూ వస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారికి డ్రగ్స్‌ వ్యవహారంలో లింకులు ఉండటం దర్యాప్తు అధికారులను నివ్వెరపరిచింది. వారిలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న యంగ్‌ హీరో ఒకరైతే, కుటుంబ కథలు, ఆటపాటలతో ఉర్రూతలూగించే హీరో మరొకరు. వీరిద్దరితోపాటు మరో ప్రముఖ నటి పేరు బయటపడటం సంచలనం రేపుతోంది. అలాగే వరుస హిట్లతో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఓ ప్రముఖ తార కూడా డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ అగ్రతారకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. సుబ్బరాజు, శ్యాం కె.నాయుడు విచారణలో వీరి పేర్లు బయటపడ్డాయని సిట్‌ వర్గాల ద్వారా తెలిసింది.
 
ఇప్పటికే నోటీసులు జారీ చేసిన 12 మందిలో ఐదుగురిని అధికారులు విచారించారు. మరో ఏడుగురిని ప్రశ్నించాల్సి ఉంది. విచారణ ఎదుర్కొన్నవారు చెబుతున్న అంశాల ఆధారంగా సిట్‌.. క్రాస్‌ చెక్‌ చేస్తోంది. వారు చెప్పే అంశాలకు బలం చేకూర్చేలా ఆధారాలూ సేకరించినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగానే ఈ నలుగురు ప్రముఖులకు నోటీసులివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మంగళవారం లేదా బుధవారం నోటీసులు జారీచేస్తామని ఎక్సైజ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.
 
డ్రగ్స్‌ కేసు ఇప్పటికే సినీ పరిశ్రమను కుదేలు చేస్తుంటే తాజాగా ఎక్సైజ్‌ అధికారులు ఓ ప్రముఖ హీరోయిన్‌ మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. సోమవారం మణికొండలో రాన్షన్‌ జోసెఫ్‌ను అరెస్ట్‌ చేసి అతడి నుంచి 4 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇతడు సినీ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ వద్ద మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. జోసెఫ్‌ ఇంటిపై అధికారులు దాడులు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ తెలిపారు. గతంలో ఇతడు హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నా వద్ద పనిచేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.
 
హీరోయిన్ల దగ్గర కీలకస్థానాల్లో పనిచేస్తున్న వారు గ్రాముల కొద్దీ గంజాయి పెట్టుకుని ఉన్నారంటే దీంట్లో అనుమానించాల్సింది ఏమీ లేదా.. మొత్తం మీద ఒకవిషయం అర్థమవుతోంది. చిన్నా పెద్దా తేడాలేకుండా టాలీవుడ్‌లో డబ్బున్న మారాజులు, డబ్బు చేసిన మారాజులూ అందరూ ఈ డ్రగ్స్ రాకెట్లో ఇరుక్కున్నట్లే.. బ్లడ్ నమూనాలు ఇవ్వడానికి చట్టాన్ని అడ్డుకున్నంత మాత్రాన వీరి చీకటి పనులు దాగవు. వచ్చే వారం మరిన్ని షాకులకు సిద్ధం కావలసిందే.