హామీ ఇచ్చాక ప్రత్యేక హోదా ఎందుకివ్వరు? నిలదీసిన టీఆరెస్ కవిత
ఆంద్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేక హోదాపై టీఆరెస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మళ్లీ గళం విప్పారు. ఎన్నికల వేళ ప్రత్యేక హోదా పదేళ్లు, పదిహేనేళ్లు సాధించుకొస్తామని బీరాలు పోయిన బీజేపీ, టీడీపీలు ప్రస్తుతం జావకారిపోయి ఉన్న నేపథ్యంలో పొరుగు రాష్టం నుంచి వచ్చిన ఆడ
ఆంద్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేక హోదాపై టీఆరెస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మళ్లీ గళం విప్పారు. ఎన్నికల వేళ ప్రత్యేక హోదా పదేళ్లు, పదిహేనేళ్లు సాధించుకొస్తామని బీరాలు పోయిన బీజేపీ, టీడీపీలు ప్రస్తుతం జావకారిపోయి ఉన్న నేపథ్యంలో పొరుగు రాష్టం నుంచి వచ్చిన ఆడబిడ్డ కవిత ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చి తీరాల్సిందేనని తేల్చి చెప్పడం గమనార్హం.
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, దానికి తాము అండగా నిలుస్తామని కవిత చెప్పారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటు సమావేశాలకు విచ్చేసిన కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీలో, కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ–బీజేపీలు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల హామీల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసిందేనని.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా తప్పక ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లేదని నిజామబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్టీలు కులాల పేరిట రెచ్చగొట్టి.. మహిళపై మహిళలనే ఉసిగొల్పి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్లపై హామీ ఇచ్చినందున.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
మహిళలు వంటింటికే పరిమితం కావాలని కొందరు చెబుతుండడం దురదృష్టకరమని కవిత వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలు ఇంట్లో ఉంటేనే వారికి భద్రత ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలను కవిత ఖండించారు. అలాంటి ప్రకటనలు మహిళా శక్తిని కించపరచడమేనని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో సామాజిక కారణాలను చూడాలని స్పష్టం చేశారు. మహిళలు హక్కుల కోసం పొరాడితే హింస పెరుగుతోందన్నారు.