బాబూ... నీ జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా..! మానసిక స్థితి సరిగానే ఉందా..!! : ఉండవల్లి
చంద్ర బాబు గారూ.. అసలు మీరు ఏమి మాట్లాడుతున్నారో తెలుసా..! గోదావరి పుష్కరాలలో ఎక్కడ తొక్కిసలాట జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నారా..! మతి భ్రమించిందా..! జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా..! చూసుకోండి అంటూ సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఎద్దేవా చేశారు. రాజమండ్రి పుష్కరాల రేవులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తొలిరోజు తొక్కిసలాట జరిగిన రేవు, తాను పుష్కర స్నానం చేసిన రేవు వేర్వేరని సీఎం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. వృద్ధాప్యం వల్ల ఆయన జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా.. లేక మానసిక స్థితిలో ఏమైనా తేడా వచ్చిందా? ఈ రెండూ కాకపోతే ప్రజలను మోసం చేస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జ్ఞాపకశక్తికి సంబంధించిన అల్జీమర్తో బాధపడ్డారు.
సీనియర్ ఎంపీ జార్జి ఫెర్నాండెజ్ కూడా అదే వ్యాధి బారిన పడ్డారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు కూడా అలాంటి వ్యాధి సోకిందన్న అనుమానాలు కలుగుతున్నాయి అని ఎద్దేవా చేశారు. తొక్కిసలాట జరిగి 45 రోజులవుతున్నా నిజాలు నిగ్గుతేలుతాయనే విచారణకు ఆదేశించలేదా అని సీఎంను నిలదీశారు. ఒక్కరు చనిపోయినా విచారణకు ఆదేశించాల్సిందేనని స్పష్టం చేశారు.