శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (21:50 IST)

సీమాంధ్ర ప్రజలకు శుభవార్త... ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత.. కేబినెట్ ఆమోదం

విభాజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బుధవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

విభాజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బుధవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడో టేబుల్‌ అంశంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం చర్చకు రాగా.. మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. 
 
ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడంతో పాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకుంటుంది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈ ఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉంది. అది సాంకేతికంగా సాధ్యంకాక పోవడంతో దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని గతేడాది సెప్టెంబర్‌ 8న కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి విజ్ఞప్తి చేశారు. 
 
దీనిపై ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించింది. దీంతో ప్రత్యేక హోదా వల్ల లభించే ప్రయోజనాలన్నీ విదేశీ రుణాల ప్రాజెక్టులకు కల్పించనున్నారు. ప్రత్యేక హోదావల్ల కేంద్రం నుంచి ఏపీకి మరో 30 శాతం నిధులు అదనంగా వస్తాయి. కేంద్రం పథకాల నుంచి మొత్తం 90 శాతం నిధులు వస్తాయి. అయితే ప్రస్తుతానికి 60 శాతం నిధులే వస్తున్నాయి. అంటే 30 శాతం అదనంగా నిధులు రావాల్సి ఉంటుంది. 30 శాతం నిధులను విదేశీ రుణాల ద్వారా రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలను కేంద్రమే భరించాలని నిర్ణయించింది. 
 
దీనిపై టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పందిస్తూ.. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. స్పెషల్ స్టేటస్‌లో వచ్చే అని ప్రయోజనాలు స్పెషల్ ప్యాకేజీ రూపంలో ఏపీకి అందజేయాలన్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని అన్నారు. దీంతో ఏపీకి ప్రత్యేకహోదా అన్న మాట ఇక మర్చిపోవాలని ఆయన సూచించారు.