1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (10:56 IST)

జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

kishan reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారమే ఈ ఎన్నికల్లో ఆయనను ఓడిస్తుందని తెలిపారు. 
 
జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు.. గెలవాలి.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. జగన్ అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదన్నారు.
 
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించినట్టే... జగన్మోహన్ రెడ్డి అహంకారమే ఆయనను ఓడిస్తుందని జోస్యం చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిపై మనస్సు పెట్టివుంటే ఫలితాలు మరోలా ఉండేవన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆయన వాపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.
 
కాంగ్రెస్ అభ్యర్థిపై గతంలో ఫైటర్ అనే అభిప్రాయం ఉండేదని.. ప్రస్తుతం అతనిపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర పడిందన్నారు. కాంగ్రెస్ క్యాడర్, లీడర్ ఆయనకు సహకరించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక రావటం బీజేపీకి కలసి వచ్చిందన్నారు.