శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (14:54 IST)

చిన్నమ్మతో రాములమ్మ భేటీ : పరప్పణ అగ్రహార జైలులో మంతనాలు

తమిళనాడు రాష్ట్రంలో చిన్నమ్మగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ నటరాజన్‌ను తెలుగునాట రాములమ్మగా గుర్తింపు పొందిన సినీ నటి విజయశాంతి కలుసుకున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ.. బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే.
 
శశికళతో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగివున్న విజయశాంతి... శుక్రవారం బెంగుళూరు వెళ్లి జైలులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పై శశికళ ఆరా తీసినట్టు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సమానదూరం పాటించాలన్న ఉద్దేశ్యంతోనే శశికళ ఫెడరల్ ఫ్రెంట్‌పై ఆరా తీసినట్టు వినికిడి. 
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా విజయశాంతి ఆస్పత్రికి వెళ్లి జయ ఆరోగ్య పరిస్థితిపై శశికళ వద్ద వాకబు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ ఉండాలని విజయశాంతి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తంచేశారు. 
 
అంతేకాకుండా, జయలలిత మరణం కారణంగా జరిగిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల సమయంలో కూడా శశికళ బంధువు దినకరన్‌ తరపున విజయశాంతి ప్రచారం కూడా చేశారు.