బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి ప్రక్షాళన... 68 మంది ఉద్యోగుల బదిలీ!
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రక్షాళన కార్యక్రమానికి దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 68 మంది ఉద్యోగులను ఇక్కడి నుంచి బదిలీ చేసింది. ఇది దుర్గగుడి చరిత్రలో పెనుమార్పు. ఇంతవరకు ఇక్కడ ఏళ్ళ తరబడి పాతుకుపోయి
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రక్షాళన కార్యక్రమానికి దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 68 మంది ఉద్యోగులను ఇక్కడి నుంచి బదిలీ చేసింది. ఇది దుర్గగుడి చరిత్రలో పెనుమార్పు. ఇంతవరకు ఇక్కడ ఏళ్ళ తరబడి పాతుకుపోయిన పురోహితులు, పూజారులు, ఉద్యోగులను కదిలించినవారు లేరు. దీనివల్ల కొంతమంది పూజారుల్లో, ఉద్యోగుల్లో అలసత్వం, నిర్లక్ష్యం పెరిగిపోయింది.
అంతేకాదు... అవినీతి కూడా బాగా పెరిగిపోయింది. దర్శనానికి వచ్చే భక్తులను ప్లేట్ కలెక్షన్ కోసం వేధించడం మొదలుకొని, దేవాలయ స్టోర్స్, కొనుగోళ్ళు, షాపుల అద్దెలు, వేలం వరకు అన్నింటిలోనూ దుర్గగుడి ఉద్యోగుల ప్రమేయం కనిపిస్తోంది.
తరచూ దుర్గగుడి ఇ.ఓ. ఇతర ఉన్నతాధికారులకు, ఉద్యోగులకు మద్య ఘర్షణ పూరిత వాతావరణం తలెత్తుతోంది. దీని వల్ల దుర్గగుడి పవిత్రత, ప్రశాంతతకు భంగం కలుగుతోంది. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్య వరస్రసాద్ సీరియస్ అయ్యారు. దుర్గగుడి ప్రక్షాళనకు నిదానంగా ప్లాన్ చేశారు.
బదిలీలకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ నివేదిక ఆధారంగా ఒకేసారి 68 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఇక్కడి వారిని అన్నవరం, మంగళగిరి, శ్రీశైలం వంటి ప్రాంతాలకు పంపి, అక్కడి వారిని దుర్గ గుడికి బదిలీ చేశారు. అర్చకులను కూడా బదిలీ చేయడం దేవాదాయశాఖలో హాట్ టాపిక్గా మారింది.
దేవాలయాల్లో తిష్ట వేస్తారా? కుదరదు : జెఎస్వి ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ
తమకు భక్తులు ముఖ్యమని, అందుకే దుర్గగుడిలో ఇంతమందిని బదిలీ చేశామని దేవాదయశాఖ ప్రిన్సపల్ సెక్రటరీ జెఎస్వి ప్రసాద్ చెప్పారు. దుర్గగుడి అభివృద్ది పనులు, పుష్కర పనులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, దుర్గగుడి ప్రక్షాళన మొదలుపెట్టాం. బదిలీ అయిన వాళ్లు మాకు విరోధులు కాదన్నారు.
ఇక్కడ నుండి బదిలీ అయిన వాళ్లని, తిరిగి మళ్ళీ ఇక్కడకి రానివ్వం.. ఎక్కడ వేశామో అక్కడే పనిచేయాలి. ఇక్కడే తిష్టవేసి సామ్రాజ్యాన్ని నడపాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. దుర్గ గుడిలో కొంతమంది వాళ్ల అవసరాలు చూసుకుంటున్నారు. మాకు భక్తులే ముఖ్యం. అలాంటివాళ్ల వల్ల ఇబ్బంది అని తెలిస్తే మళ్ళీ ప్రక్షాళనకి వెనుకాడం అని చెప్పారు. మంచి అధికారులకి కొదవగా ఉంది. సరైన ఆఫీసర్ల కొరత ఉంది. కొన్ని ఒత్తడిల వల్ల కాస్త ఆలస్యం అవుతుంది కాని, త్వరలో దుర్గ గుడికి పర్మినెంట్ ఈవోను వేస్తాం అని హామీ ఇచ్చారు.