శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (18:01 IST)

ప్రియుడితో వివాహేతరసంబంధం వద్దన్నాడనీ భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో సాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధం వద్దన్నాడనీ భర్తను కడతేర్చిందో కసాయి భార్య. ఈ దారుణం కడప జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో జరిగింది.

ప్రియుడితో సాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధం వద్దన్నాడనీ భర్తను కడతేర్చిందో కసాయి భార్య. ఈ దారుణం కడప జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో జరిగింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ కేంద్రంలో స్వాతి అనే వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది. ఇపుడు ఇిద మరచిపోకముందే ఇలాంటి ఘటనే కడపలో వెలుగులోకి వచ్చింది. 
 
చవనవారిపల్లె గ్రామానికి చెందిన శివ, అరుణ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, అరుణకు వివాహానికి ముందే సాయి సుభాష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. పెళ్లయిన తర్వాత కూడా ఇది కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ విషయం భర్తకు తెలిసి మంచి పద్దతి కాదంటూ భార్యను మందలించాడు. దీంతో ప్రియుడిపై మోజుతో భర్త అడ్డు తొలగించుకోవాలని అరుణ భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించింది. సుభాష్ తన ఇద్దరు మిత్రులతో కలిసి పార్టీ పేరుతో భార్యభర్తలిద్దరిని తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి శివపై దాడి చేసి చంపేశారు. 
 
అనంతరం మృతదేహాన్ని పుల్లంపేట మండలం అన్నసముద్రం అటవీప్రాంతంలో పూడ్చిపెట్టారు. అయితే, శివ కనిపించకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరుణ, సాయి సుభాష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.