ఏపీ మంత్రులకు యోగా తరగతులు.. ప్రారంభించిన చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ తరగతులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు.
ఇప్పటికే చంద్రబాబు యోగా మంత్రాన్ని పఠిస్తున్న విషయం తెల్సిందే. తానే కాక తన ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు కూడా యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక పనితీరును కూడా మెరుగుపరచుకోవాల్సిందేనని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల జారీతో సరిపెట్టని చంద్రబాబు, ఏకంగా మంత్రులు, సీనియర్ అధికారులకు ప్రత్యేకంగా యోగా తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఈ తరగతుల నిర్వహణ బాధ్యతను ఈషా ఫౌండేషన్కు అప్పగించారు.
దీంతో గురువారం నుంచి మూడు రోజుల పాటు హైదరాబాదులో నిర్విఘ్నంగా కొనసాగే తొలి విడత యోగా తరగతులకు మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు హాజరుకానున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలోని ఈషా ఫౌండేషన్కు చెందిన వంద మంది వాలంటీర్లు... మంత్రులు, అధికారులకు యోగాసనాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మలి విడతలో ఎమ్మెల్యేలకూ యోగాలో శిక్షణ ఇప్పించాలని చంద్రబాబు సర్కారు యోచిస్తోంది.