శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (11:31 IST)

చంద్రబాబుపై మండిపడిన జగన్.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ దారుణం జరిగిపోయిందని చంద్రబాబు చెప్పడంపై జగన్ మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. 
 
కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా సాధారణ ఘాట్లో పుష్కరస్నానం ఆచరించారన్నారు. దీన్నంతా షూటింగ్ కూడా చేశారని చెప్పారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటమే ఇంత మంది ప్రాణాలను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదని జగన్ ఆరోపించారు.
 
అలాగే పబ్లిసిటీ కోసం వీఐపీ ఘాట్‌ను వదిలేసి సరస్వతి ఘాట్ వద్ద చంద్రబాబు స్నానం చేయడం ద్వారానే తొక్కిసలాట చోటుచేసుకుందని, గోదావరి పుష్కరాలపై తీసిన ఓ స్టోరీలో హీరోగా కనిపించాలనే ఉద్దేశంతోనే ప్రజలను పొట్టనబెట్టుకున్నారని జగన్ విమర్శలు చేశారు.