శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (14:07 IST)

ఎమ్మెల్యే కొనుగోలు కేసు నుంచి తప్పించుకునేందుకే సెక్షన్ 8 : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలను నల్లధనంతో కొనుగోలు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు సెక్షన్ 8ను తెరపైకి తెచ్చారంటూ ఆయన ఆరోపించారు. 
 
తూర్పుగోదావరి జిల్లా ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ... నల్లధనంతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఆడియో టేపుల్లో అడ్డంగా బుక్కైన చంద్రబాబును అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 నుంచి 20 కోట్ల మేరకు ఇచ్చేందుకు బహిరంగంగా బేరసారాలు నెరపిన సీఎం దేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు తప్ప మరెవరూ లేరని జగన్ ఆరోపించారు. 
 
రాష్ట్ర విభజన జరిగి యేడాది గడిచిపోయిన తర్వాత చంద్రబాబుకు సెక్షన్ 8 గుర్తుకు రావడం విచిత్రంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలన్నీ అదుపులోనే ఉన్నాయన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8, అందులో ఒక భాగమని జగన్ గుర్తు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు సెక్షన్ 8 వాదనను ఎత్తుకున్నారని ఆయన ఆరోపించారు.