శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (10:06 IST)

బుట్టా రేణుకకు లాభాదాయక పదవీగండం..

వైకాపా ఎంపీ బుట్టా రేణుకపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె వైకాపా తరపున కర్నూలు లోక్‌సభ సభ్యురాలిగా ఉంటూనే కేంద్ర శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ

వైకాపా ఎంపీ బుట్టా రేణుకపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె వైకాపా తరపున కర్నూలు లోక్‌సభ సభ్యురాలిగా ఉంటూనే కేంద్ర శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సీఎస్‌డబ్ల్యూబీ) జనరల్ బాడీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. ఇది లాభదాయకమైన పదవిగా పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొని, ఆమెపై చర్యలకు సిఫారసు చేసినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. దీంతో ఆమెపై అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి జూలై 26, 2016లో లోక్‌సభ నుంచి బుట్టా రేణుక, రావత్‌లను సీఎస్‌డబ్ల్యూబీ సభ్యులుగా నియమిస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో ఇది లాభదాయక పదవి అని తేలింది. దీంతో ఈ బోర్డులో సభ్యులుగా ఉన్న వారిపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది.
 
ఎంపీగా ఉంటూనే మరో లాభదాయకమైన పదవిని అనుభవిస్తున్నట్టు వస్తున్న వార్తలపై రేణుక స్పందించారు. తనను ప్రభుత్వమే బోర్డులో నియమించిందని, ఈ విషయంలో తన ప్రమేయం ఎంతమాత్రమూ లేదని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటుకు సిఫారసు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. సభ్యురాలిగా ఉన్నప్పటికీ బోర్డు నుంచి తాను ఎటువంటి జీతభత్యాలను అందుకోవడం లేదని రేణుక వివరించారు.