మొటిమలతో చికాకా..? ఇలా చేసి చూడండి..!!
చాలా మంది మహిళలు ముఖంపై మొటిమలతో చికాకు పడుతుంటారు. ఇలాంటి వారికి ఇంట్లోనే ఉంటూ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం.
* ముఖంపై గుత్తులు గుత్తులుగా, అల్లుకున్నట్లుగా ఉండే మొటిమలతో టీనేజీ అమ్మాయిలు సతమతం అవుతుంటారు. ఇలాంటివారు మొటిమలకు గుడ్బై చెప్పాలంటే.. ఒక టీస్పూన్ గంధపు పొడిలో చిటికెడు పసుపు, కాసిన్ని పాలుపోసి ముఖానికి పట్టిస్తూ ఉంటే క్రమేణా మొటిమలు, వాటివల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, బ్లాక్హెడ్స్ తగ్గిపోతాయి.
* మొటిమలను నివారించేందుకు రెండు రోజులకు ఒకసారి అరకప్పు అలోవేరా గుజ్జును ద్రవంగా చేసి త్రాగాలి. లేదా చర్మంపై పూసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మొటిమల నుంచి విముక్తమవ్వవచ్చు. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలోవేరా (కలబంద) గుజ్జును త్రాగకూడదు. దాల్చిన చెక్కను పేస్ట్గా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేసినా ఫలితం ఉంటుంది.
* రాత్రిపుట పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, మెంతి ఆకుల పేస్ట్ని పట్టించి ఆరిన తర్వాత కడిగేసినా మోటిమలు మాయమవుతాయి. ఇక పిగ్మెంటేషన్ పోవాలంటే.. అయిదు బాదంపప్పులను పొడిచేసి అందులో ఒక టీస్పూన్ మీగడ, కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి పదిహేను నిముషాల తర్వాత కడిగేస్తే పిగ్మెంటేషన్ను క్రమంగా తగ్గించవచ్చు.