శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (07:35 IST)

విలీనంపై మంతనాలు: నేడే పన్నీర్, పళనిస్వామి వర్గాల తుది చర్చలు

ఎన్నికల కమిషన్‌కే కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఆరోపణపై అన్నాడీఎంకే అమ్మ వర్గం ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ అరెస్టు తప్పదని తేలిపోవడంతో అధికారాన్ని నిలుపుకోవడం ఎలా అనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నాడీంఎకేలోని రెండు చీలిక

ఎన్నికల కమిషన్‌కే కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఆరోపణపై అన్నాడీఎంకే అమ్మ వర్గం ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ అరెస్టు తప్పదని తేలిపోవడంతో అధికారాన్ని నిలుపుకోవడం ఎలా అనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు విలీనం కానున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి చకచకా సాగిన పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. రెండు వర్గాల మధ్య విలీన చర్చలపై మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం మాట్లాడిన అనంతరం... సోమవారం ఉదయం కేబినెట్‌ మంత్రులతో సీఎం పళనిస్వామి సుదీర్ఘంగా చర్చించారు.
 
తమిళనాడు ఆరోగ్యమంత్రి సి విజయభాస్కర్ నివాసంలో ఐటీ దాడుల నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఓ పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోనున్నారన్న పుకార్ల మధ్య సోమవారం రాత్రి  శశికళ వర్గం కేబినెట్ లోని పలువురు మంత్రులు సుదీర్ఘ సమావేశం జిరిపారు. రెండు గంటలకు పైగా సాగి రాత్రి 11 గంటలకు ముగిసిన సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి డి జయకుమార్ సమావేశ వివరాలను మీడియాకు తెలిపారు. అన్నాడిఎంకే అధికార గుర్తు వివాదాన్ని పరిష్కరించడం, పార్టీలో ఐక్యతను సాధించడం అనే రెండు అంశాలపైనే తాము చర్చించామని జయకుమార్ చెప్పారు. పార్టీలో 123 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి కట్టుగా ఉన్నామని, అమ్మ పాలన కొనసాగుతుందని, రెండాకుల గుర్తు పార్టీకి తిరిగి వస్తుందని ఆశాభావంతో ఉన్నామని మంత్రి తెలిపారు. 
 
తామంతా శశికళ వర్గాన్నే బలపరుస్తున్నట్లు పార్టీ సభ్యులందరూ తమ అఫిడవిట్లు సమర్పించాలని, గడువులోగా వాటిని ఎన్నికల కమిషన్‌కు సమర్పించడానికి వాటిని ఎలా సేకరించాలన్న అంశంపై కూడా తాము చర్చించామని జయకుమార్ తెలిపారు. గ్రీన్‌వేస్‌ రోడ్డులోని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి కె.తంగమణి అధికారిక నివాసంలో చర్చలు కొనసాగాయి. ఈ భేటీలో శశికర, పన్నీర్‌ సెల్వం వర్గాల విలీనంపై చర్చించారు. భేటీ అనంతరం డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన విధివిధానాలు, సమైక్యంగా పార్టీని ముందుకు నడపడంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. విలీనంపై పన్నీర్‌సెల్వం ఆలోచనను భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్వాగతించారని ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్‌ వెల్లడించారు. 
 
అమ్మ పాలన కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే అందరి అభిప్రాయమన్నారు. పార్టీ డిప్యూటీ చీఫ్‌ దినకరన్‌ బెంగళూరులో ఉన్నందున తిరిగివచ్చాక ఈ అంశంపై ఆయనతో చర్చిస్తామని న్యాయ శాఖ మంత్రి సి.వి.షణ్ముగం అన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.