శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (13:29 IST)

నిస్వార్థ సేవలో తరిస్తున్న ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్: గవర్నర్ కె రోశయ్య

కన్నీళ్లు - చెమట రెండూ ఉప్పగానే ఉంటాయనీ, కానీ, కన్నీళ్ళు సానుభూతిని కురిపిస్తే.. చెమట మార్పును సూచిస్తుందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. గురువారం రాత్రి చెన్నై టీ నగర్‌లోని ఆస్కా ప్రాంగణంలో జరిగిన ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్టు తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
 
 
ఈ సందర్భంగా ఆయన ఈ చారిటబుల్ ట్రస్టు, దాని వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ ఫిజియోథెరపిస్టు డాక్టర్ సునీల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజంలో సాయం ఎదురు చూస్తున్న వారికి ట్రస్టు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా డాక్టర్ సునీల్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా, నిస్వార్థసేలను కొనియాడదగినవన్నారు. 
 
నిజానికి సమాజసేవ మానవాళి పుట్టుకముందు నుంచే ఉందన్నారు. అందుకే దీన్ని ఫాదర్‌హుడ్ ఆఫ్ గాడ్, బ్రదర్‌హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారని గుర్తు చేశారు. అంతేకాకుడా, సమాజ సేవ మూలాలను శోధిస్తే పురాతనకాలం నుంచే ఈ చారిటీలు ఉన్నాయన్నారు. దీనికి నిదర్శనంగా రుగ్వేదంలోనూ, ఉపనిషత్తుల్లోనూ వీటి ప్రస్తావన ఉందన్నారు. భగవద్గీత కూడా పేదలకు సాయం చేయమనే చెపుతోందన్నారు.

గత మూడేళ్లుగా ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్టు చేస్తున్న సేవలను తాను ప్రత్యేకంగా అభివనందిస్తున్నట్టు చెప్పారు. గత 2012లో తన చేతుల మీదుగా పురుడు పోసుకున్న ఈ సంస్థ ఇపుడు తృతీయ వార్షికోత్సవం జరుపుకోవడం, ఆ వేడుకల్లో కూడా తాను ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
 
 
చెన్నై, మౌళివాక్కం భవన ప్రమాద సమయంలో డాక్టర్ సునీల్ తక్షణం స్పందించి బాధితులను ఆదుకున్న తీరు అమోఘమన్నారు. గత మూడేళ్ల కాలంలో 15 మెగా వైద్యశిబిరాలు, 7 మెగా రక్తదాన శిబిరాలు, 216 మందికి వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహించడాన్ని తాను స్వాగతిస్తూ.. మున్ముందు కూడా ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటున్నట్టు గవర్నర్ కె రోశయ్య కోరారు. 
 
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న తమిళ సినీ హాస్య నటుడు వివేక్ మాట్లాడుతూ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గుడులు, గోపురాలు చుట్టూ తిరగాల్సిన అవరం లేదనీ, సమాజంలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆపన్నహస్తం అందిస్తే అదే దైవ సేవతో సమానమని స్వామి వివేకానంద చెప్పారని, ఈ సూక్తిని డాక్టర్ సునీల్ అక్షరాలా పాటిస్తున్నారని కొనియాడారు.


అనంతరం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టీ జీఎం అక్బర్ అలీ మాట్లాడుతూ.. ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్టు ప్రారంభమై మూడేళ్లు అయినప్పటికీ ఈ సంస్థ సేవలు చూస్తుంటే 30 యేళ్ళ సంస్థ చేసినట్టుగా ఉందన్నారు. ఈ సంస్థను నడుపుతున్న డాక్టర్ సునీల్‌కు దానకర్ణుడు వంటి మనస్సు ఉందని ఆయన కొనియాడుతూ... మహాభారతంలోని ఓ కథను చెప్పారు. 
 
అనంతరం పల్లవా గ్రానైట్స్ అధినేత డాక్టర్ కె సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తున్న డాక్టర్ సునీల్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యాలకు తనవంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సభా ముఖంగా హామీ ఇచ్చారు. అంతకుముందు డాక్టర్ సునీల్ స్వాగతోపన్యాయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్లస్‌టూలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు బంగారు పతకాలు, వికలాంగులకు త్రిచక్ర స్కూటర్లు, కృత్రిమ అవయవాలను గవర్నర్ చేతుల మీదుగా బహుకరించారు.