గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (15:21 IST)

తూగోలో కరోనా టెర్రర్ - ఒక వ్యక్తి నుంచి 77 మందికి వ్యాప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ముఖ్యంగా, పచ్చని పాడిపంటలతో కనిపించే గోదావరి జిల్లాల్లో ఈ వైరస్ మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఓ వ్యక్తి నుంచి ఏకంగా 77 మందికి ఈ వైరస్ వ్యాపించింది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దీంతో స్థానికలు హడలిపోతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ 19తో మృతి చెందిన ఓ వ్యక్తి ద్వారా ఇప్పటివరకు సుమారు 77 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో జి మామిడాడలో 56మంది, బిక్కవోలు 13మంది, రామచంద్రపురంలో ఏడుగురు, తునిలో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి మే 21వ తేదీన కరోనాతో మృతిచెందగా, అప్పటినుంచి వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
 
కాగా, కంటికి కనిపించని శత్రువుపై మన దేశంతోపాటు ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 215 దేశాలకు పైగా ఈ వైరస్ సోకింది. పైగా, ఈ వైరస్ వ్యాప్తి ఎపుడు, ఎలా జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో మానవజాతికి ఇది అతిపెద్ద సవాల్‌గా మారింది. పైగా, ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి మందు లేకపోవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. అందుకే స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష మంత్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జపిస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించ, ఇంట్లో నుంచి కాలు బయపెడితే ముఖానికి మాస్క్ విధిగా ధరించడం, బయటకెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం. అయినా కొంతమంది ఈ విషయాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతుండటంతో ఈ వైరస్ బారినపడుతూ, మరికొంతమందికి అంటిస్తున్నారు.