శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (14:17 IST)

నో బాల్ ఇచ్చి... ధోనీ సేనను పాకిస్థాన్ అంపైర్ అలీమ్ ధర్ గెలిపించాడా?

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో గురువారం జరిగిన వరల్డ్ కప్ రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును పాకిస్థాన్ అంపైర్ ఆలీమ్ ధర్ గెలిపించారంటూ బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆ అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయం వల్లే ధోనీ సేన సెమీస్‌లోకి అడుగుపెట్టిదని వారు ఆరోపిస్తూ.. పాక్ అంపైర్ దిష్టిబొమ్మను ఆ దేశ రాజధాని ఢాకాలో తగులబెట్టారు. 
 
సాధారణంగా క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్‌లు చిరకాల ప్రత్యర్థులనే విషయం ప్రతి చిన్నపిల్లవాడికీ తెలిసిందే. ఈ విషయం ఈ రెండు దేశాల వారికే కాక ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. మరి టీమిండియాను పాకిస్థానీ అంపైర్ గెలిపించడమేంటి?. అదే విషయాన్ని అడిగితే, బంగ్లా క్రికెట్ అభిమానులు మాత్రం ఇది ముమ్మాటికీ నిజమని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాక వరల్డ్ కప్ నుంచి తమ జట్టు నిష్క్రమణకూ ఆ పాకిస్థానీ అంపైర్ అసంబద్ధ నిర్ణయమే కారణమని వారు వాపోతున్నారు. 
 
గురువారం ఎంసీజీలో జరిగిన మ్యాచ్‌కు పాక్ జాతీయుడు అలీమ్ దార్ ఒక ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. భారత స్టైలిష్ బ్యాట్స్‌మన్, ఈ మ్యాచ్ హీరో రోహిత్ శర్మ ఔటైన బంతిని అలీమ్ దార్ నోబాల్‌గా ప్రకటించారు. బంగ్లా బౌలర్ వేసిన బంతి రోహిత్ నడుము కంటే ఎత్తులో వేశాడనీ అందువల్ల అది నో బాల్ అని ప్రకటించాడు. దీంతో లైఫ్ లభించిన రోహిత్, ఆ తర్వాత సెంచరీతో అదరగొట్టడమే కాక జట్టు స్కోరు 300 దాటడానికి పునాది వేశాడు. 
 
అయితే, బంగ్లా క్రికెట్ అభిమానులు మాత్రం రోహిత్ ఖచ్చితంగా ఔటేనని చెబుతున్నారు. అయితే, అలీమ్ దార్ అసంబద్ధ నిర్ణయమే తమ జట్టును పరాజయం బాట పట్టించిందని తేల్చేశారు. దీంతో అలీమ్ దార్‌పై బంగ్లా అభిమానులు ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అలీమ్ దార్ దిష్టిబొమ్మను బంగ్లా అభిమానులు ఢాకా వీధుల్లో దగ్ధం చేసి... ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.