గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (14:45 IST)

ఒకప్పుడు భారత క్రికెటర్ తర్వాత టెక్కీ.. ఇపుడు అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్

ఆయన ఒకపుడు భారత క్రికెటర్. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారాడు. ఇపుడు అమెరికా క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అతగాడి పేరు సౌరభ్ నేత్రవాల్కర్. 27 యేళ్ల ఈ క్రికెటర్ కథ వింటుంటే ఆసక్తికరంగా ఉంటుంది. 
 
నిజానికి సౌరభ్ గత 2010లో అండర్ 19 ప్రపంచ కప్‌లో మీడియం పేసర్‌గా రాణించాడు. ముంబై తరపున రంజీ మ్యాచ్ కూడా ఆడాడు. చదువులోనూ మేటి.. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. రెండేళ్ళ పాటు క్రికెట్‌లో తన కెరీర్ ఎదుగూబొదుగూ లేదని తెలిసిపోయింది. అంతే టోఫెల్ రాసి అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. 
 
అయినప్పటికీ సౌరభ్‌కు క్రికెట్‌పై ఉండే ధ్యాస మాత్రం పోలేదు. క్రికెట్‌పై అతని ఇష్టం అతన్ని మళ్లీ మైదానంవైపు నడిపించింది. అంతే కొంతకాలాని అమెరికా జాతీయ జట్టుకు ఎంపికవడమే కాదు. ఇప్పుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2010 అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆడిన ఏకైక రంజీమ్యాచ్‌లో మూడు వికెట్లతో రాణించాడు.
 
ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల సౌరభ్ స్పందిస్తూ, భారత్‌లో ఉంటే క్రికెట్‌లో అవకాశాలు రావని.. అమెరికా చేరి వారాంతాల్లో క్రికెట్ ఆడుతూ అమెరికా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు చెప్పారు. శుక్రవారం సాయంత్రం తొందరగా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి లాస్‌ఏంజిల్స్‌కు ఆరుగంటలు ప్రయాణించి చేరేవాడిని. శనివారం 50 ఓవర్ల మ్యాచ్ ఆడి మళ్లీ తిరిగి శాన్‌ఫ్రాన్సిస్కో చేరేవాడిని. మళ్లీ ఆదివారం మరో 50 ఓవర్ల మ్యాచ్ ఆడి.. సోమవారం ఆఫీస్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నా. దీంతో అమెరికా జట్టుకు ఎంపికయ్యే అవకాశం వచ్చింది అని నేత్రవాల్కర్ అన్నాడు.