గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (11:18 IST)

హార్దిక్ పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: ప్రత్యేక కోర్టు

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఓ వైపు భార్యామణి ఆరోపణలతో తలపట్టుకుని కూర్చున్న వేళ, డాక్టర్ అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్ చేశాడంటూ టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లోకెక్కాడు. దేశంలోకి

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఓ వైపు భార్యామణి ఆరోపణలతో తలపట్టుకుని కూర్చున్న వేళ, డాక్టర్ అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్ చేశాడంటూ టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లోకెక్కాడు. దేశంలోకి రిజర్వేషన్లనే రోగాన్ని ఎక్కించారంటూ పాండ్యా చేసిన ట్వీట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. ఈ ట్వీట్స్ గత ఏడాది డిసెంబరులో చేసినా.. పాండ్యాపై కేసు నమోదు చేయాలని ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు పోలీసులను ఆదేశించింది. 
 
పాండ్యా ట్వీట్స్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించేలా వుందంటూ డీఆర్ మేఘ్‌వాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాండ్యా తన ట్వీట్‌తో అంబేద్కర్‌ను, ఆ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీశాడని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
కాగా రిజర్వేషన్లు అనే వ్యాధిని దేశంలో అంబేద్కర్ వ్యాప్తి చేశారని పాండ్యా ట్వీట్ చేశాడు. పాండ్యా లాంటి పాప్యులర్ క్రికెటర్ ఇటువంటి ట్వీట్లు చేయడం సమంజసం కాదన్న పిటిషన్‌దారు పేర్కొన్నారు. ఆ వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాజ్యాంగాన్ని తూలనాడాడని పేర్కొన్నారు. 
 
రాజ్యాంగ నిర్మాణాన్ని పాండ్యా అపహాస్యం చేశాడని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో పాండ్యాకు కొత్త చిక్కొచ్చి పడింది.