గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (11:52 IST)

సెంచూరియన్ టెస్టు : విజయానికి 252 రన్స్ దూరంలో కోహ్లీ సేన

సెంచూరియన్ పార్క్ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయానికి 252 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఓపెనర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తక్క

సెంచూరియన్ పార్క్ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయానికి 252 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఓపెనర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. దీంతో భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. 
 
అంతకుముందు దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. 90/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగో రోజైన మంగళవారం (జనవరి 16) ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీలు.. మరో 168 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లు కోల్పోయారు. భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. డివిలియర్స్‌ (80; 121 బంతుల్లో 10 ఫోర్లు), డీన్‌ ఎల్గర్‌ (61; 121 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) దాటిగా ఆడటంతో సఫారీలకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
 
అనంతరం ఫిలాండర్‌ (26;85 బంతుల్లో 2 ఫోర్లు) సహకారంతో డుప్లెసిస్‌ (48; 141 బంతుల్లో 4 ఫోర్లు) కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. టీమిండియా బౌలర్లలో మొహమ్మద్‌ షమీ 4 వికెట్లు సాధించగా, బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌ శర్మకు 2, అశ్విన్‌‌కు ఒక వికెట్‌ దక్కాయి.
 
ఆ తర్వాత 287 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సారథి విరాట్ కోహ్లీ సహా ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ స్వల్ప కోరుకే బ్యాట్లెత్తేశారు. దీంతో గెలుపు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 35/3తో నిలిచింది. ఛతేశ్వర్‌ పుజారా (11; 40 బంతుల్లో 1×4), పార్థివ్‌ పటేల్‌ (5; 24 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. 
 
విరాట్‌ కోహ్లీ (5; 20 బంతుల్లో 1×4), కేఎల్‌ రాహుల్‌ (4; 29 బంతుల్లో) స్వల్ప వ్యవధిలోనే పెవీలియన్‌ బాటపట్టారు. అరంగేట్ర బౌలర్ లుంగి ఎంగిడి వీరిద్దరినీ ఔట్‌ చేశాడు. అనంతరం రబాడ బౌలింగ్‌లో మురళీ విజయ్ (9; 25 బంతుల్లో 1×4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది.