శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (12:14 IST)

చివరి మూడు వన్డేలకు భారత జట్టు... షమీపై వేటు...

స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, చివరి మూడు వన్డే మ్యాచ్‌లకు బారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త జట్టును ప్రకటించింది. ఈ వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు అంచనాలకు మించి గట్టి పోటీనిస్తుండటంతో జట్టులో కీలక మార్పులు చేశారు. ఇందుకోసం తమ బౌలింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న ప్రధాన పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, జస్ర్పీత్‌ బుమ్రాలను తిరిగి వన్డే జట్టులో చేర్చారు. 
 
ఈ మేరకు గురువారం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. ఇప్పటికి జరిగిన రెండు వన్డేల్లో భారత్‌ తొలి మ్యాచ్‌ గెలవగా విశాఖ వన్డే టైగా ముగిసింది. ఆసియా కప్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చినట్టుగానే ఆ టోర్నీ ముగిశాక భువీ, బుమ్రాలను టెస్టు సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. 
 
ఆ టోర్నీలో బుమ్రా 8 వికెట్లు తీయగా భువనేశ్వర్‌ ఆరు వికెట్లతో రాణించాడు. అంతకుముందే ఈ ఇద్దరూ గాయాల నుంచి కోలుకున్నారు. అందుకే వెంటనే విండీస్‌తో సిరీస్‌ ఆడితే వారిపై అధిక భారం పడుతుందని భావించారు. అంతేకాకుండా ప్రపంచక్‌పకు ముందు జట్టు తమ కీలక బౌలర్లను గాయాల బారి నుంచి కాపాడుకోవడం ముఖ్యమని మేనేజ్‌మెంట్‌ భావించింది.
 
ఇకపోతే, తొలి రెండు మ్యాచ్‌లలో పేసర్లు పెద్దగా ప్రభావం చూపింది లేదు. అయితే అనూహ్యంగా మహ్మద్‌ షమిపై మాత్రమే సెలెక్టర్లు వేటు వేశారు. 20 ఓవర్లలో 140 (81, 59) పరుగులివ్వడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. అయితే ఈక్రమంలో అతడు మూడు వికెట్లు తీసినా జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో మిగిలిన మూడు వన్డేలకు దూరం కానున్నాడు. అటు ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ మాత్రం తమ స్థానాలను కాపాడుకున్నారు. 
 
ఇదిలావుంటే, పుణెలో శనివారం జరిగే మూడో వన్డే తర్వాత సెలెక్టర్లు ఆరు టీ20ల కోసం జట్టును ప్రకటించనున్నారు. దీంట్లో స్వదేశంలో విండీస్‌తో మూడు టీ20లు ఆడనుండగా మిగిలినవి ఆసీస్‌ పర్యటనలో జరుగుతాయి. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్‌ కోహ్లీకి విండీస్‌‌తో జరిగే టీ20లకు విశ్రాంతి కల్పిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 
భారత జట్టు
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ధోనీ, జడేజా, మనీష్‌ పాండే, లోకేశ్‌ రాహుల్‌, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌, జస్ర్పీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌.