అంబటి రాయుడు సూపర్ ఇన్నింగ్స్కు ధోనీనే కారణమట!
జింబాబ్వేతో శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్లో హైదరాబాదీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ సెంచరీతో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు.
ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ... కెప్టెన్ కూల్ ధోనీ నుంచే అంతా నేర్చుకున్నానని వ్యాఖ్యానించాడు. శుక్రవారం నాటి మ్యాచ్ చివరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగింది.
అయితే అంబటి రాయుడి సూపర్ ఇన్నింగ్స్తో చివరకు టీమిండియానే గెలుపును నమోదు చేసుకుంది. అంత ఒత్తిడిలోనూ కుర్రాళ్లు బాగానే ఆడారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారిలో ఈ తరహా నైపుణ్యం పెంపొందడానికి కారణమేంటని అంతా ఆరా తీస్తుంటే, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న రాయుడు సూటి సమాధానం చెప్పేశాడు.
టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచే తాను ఇదంతా నేర్చుకున్నానని అతడు ప్రకటించాడు. ఒత్తిడిని ఎలా అధిగమించాలనే సూత్రం ధోనీ నుంచే నేర్చుకున్నానని అంబటి స్పష్టంగా తెలియజేశాడు.