నాకు తెలిసినన్ని ట్రిక్కులు కుంబ్లేకు తెలియవే.. ఎలా సెలెక్ట్ చేశారబ్బా... ఎనీహౌ గుడ్లక్ : రవిశాస్త్రి
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపట్ల మాజీ క్రికెటర్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తనకు తెలిసినన్ని ట్రిక్కులు, అనుభవం కుంబ్లేకు లేవంటూ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ ఎంపికపై రవిశాస్త్రి స్పందిస్తూ "కోచ్ నియామకంపై బీసీసీఐ నిర్ణయం నన్ను నిరాశపరిచింది. 18 నెలల పాటు నా పనితీరుతో మంచి ఫలితాలను రాబట్టగలిగాను. అయితే ఒకటి మాత్రం చెప్పగలను గత కొంతకాలంగా భారత జట్టును నిశితంగా పరిశీలించాను ఆ అనుభవం ఉపయోగపడుండేది. కోచ్గా నియామకమైన కుంబ్లేకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా" అని రవిశాస్త్రి అన్నాడు.
వాస్తవానికి రవిశాస్త్రి ప్రధాన కోచ్ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నాడు. అందుకే కోచ్ ఎంపిక ప్రక్రియలో భాగంగా బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసిన మొదట్లోనే రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్నాడు. తాను ప్రధాన కోచ్గా నియామకమైతే సహాయక కోచ్లుగా ఎవరెవరు ఉండాలో కూడా రవిశాస్త్రి ఆత్మవిశ్వాసంతో ప్రకటించేశాడు కూడా. కానీ.. కోచ్ రేసులోకి మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రాకతో రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురైంది.
టీమిండియా డైరెక్టర్ హోదాలో 18 నెలల పాటు భారత్ జట్టును విజయవంతంగా నడిపించిన రవిశాస్త్రికి ఆ అనుభవం ఉపయోగపడుతుందని అంతా అనుకున్నారు. అయితే కోచ్ పదవికి ఇంటర్వ్యూలను నిర్వహించిన బీసీసీఐ సలహా కమిటీ సభ్యులు సచిన్ టెండూల్కర్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లను తన ప్రణాళికలతో మెప్పించిన కుంబ్లే కోచ్ పదవికి కైవసం చేసుకున్నాడు. ఫలితంగా ఒక యేడాది పాటు జట్టుకు సేవలు అందించనున్నాడు.