శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (17:26 IST)

సెమీస్‌లో ఓటమిని తట్టుకోవడం చాలా కష్టం : సచిన్ టెండూల్కర్

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల మధ్య మంగళవారం జరిగిన ఉత్కంఠ భరిత సెమీ ఫైనల్ మ్యాచ్‌పై భారతీయ క్రికెట్ లెజెండ్ సచిన్ స్పందించాడు. ఏ జట్టైనా సెమీ ఫైనల్ వరకు చేరి, అక్కడ ఓటమిపాలైతే... దాన్ని తట్టుకోవడం ఓడిన జట్టు క్రికెటర్లకు చాలా కష్టమన్నాడు. సెమీస్‌లో ఓడిపోయినప్పటికీ టోర్నీ మొత్తం దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని కొనియాడాడు. ఇదేసమయంలో న్యూజిలాండ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. అద్భుత క్రికెట్ ఆడి, ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్నందుకు అభినందనలు తెలియజేశాడు. 
 
ఇకపోతే.. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఉత్కంఠ భరిత పోరులో దక్షాణాఫ్రికాను ఖంగుతినిపించి న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. 43 ఓవర్లలో 298 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించి జయకేతనం ఎగురవేశారు. ఆట మొత్తం నువ్వా? నేనా? అన్న రీతిలో సాగింది. కొన్ని సందర్భాల్లో దక్షిణాఫ్రికా ఫైనల్స్ చేరుతుందని కూడా అనిపించింది. 
 
అయితే చివరి ఓవర్లో మరో బంతి మిగిలి ఉండగానే ఇలియట్ సిక్స్ కొట్టడంతో కివీస్ ఫైనల్స్ చేరింది. దీంతో, కివీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేడియంలోని కివీస్ అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే, మూడు కివీస్ వికెట్లు పడగొట్టి టెన్షన్ క్రియేట్ చేసిన సఫారీ బౌలర్ మోర్కెల్ మాత్రం ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఉద్వేగాన్ని, బాధను ఆపుకోలేక గ్రౌండ్‌లోనే కంటతడి పెట్టాడు. మోర్కెల్‌‌తో పాటు ఆటగాళ్లంతా తీవ్ర వేదనకు గురయ్యారు.