శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 22 జూన్ 2017 (02:15 IST)

కోచ్ గురించి ఫిర్యాదు చేస్తే వారిని వెంటనే జట్టులోంచి తీసేయాలి: మండిపడిన గవాస్కర్

కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని వెంటనే జట్టులోంచి తీసేయాలి అంటూ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తేల్చి చెప్పారు. అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్‌ పదవినుంచి తప్పుకోవడం భారత క్రికెట్ చరిత్రలో అతి విషాదకరమైన దినం అంటూ విచారం వ్యక్తం

కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని వెంటనే జట్టులోంచి తీసేయాలి అంటూ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తేల్చి చెప్పారు. అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్‌ పదవినుంచి తప్పుకోవడం భారత క్రికెట్ చరిత్రలో అతి విషాదకరమైన దినం అంటూ విచారం వ్యక్తం చేసిన గవాస్కర్ ప్రాక్టీస్‌కి డుమ్మా కొడతామంటే ఒప్పుకునే తరహా కోచ్‌ని జట్టు సభ్యులు కోరుకుంటున్నారేమో అంటూ తూర్పార బట్టారు. 
 
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విబేదాల గురించి నాకు చాలా తక్కువగానే తెలుసు. కాని ఇది భారత క్రికెట్‌కు నిజంగానే విషాద దినమని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. అనిల్ కోచ్ బాధ్యతలు స్వీకరించాక టీమిండియా అన్ని విజయాలూ సాధించింది. ఒక్క సంవత్సరంలోనే అనిల్ అంత తప్పు చేసినట్లు నాకయితే కనిపించలేదు. ఏ జట్టులో అయినా విభేదాలు ఉంటాయి. కానీ అంతిమంగా చూడాల్సింది సాధించిన ఫలితాలే అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.  
 
తాను క్రికెట్ ఆడే రోజుల్లో కుంబ్లే గొప్ప పోరాట యోధుడిగా ఉండేవాడు, తీవ్ర గాయాల పాలైనప్పుడు కూడా కట్టుకట్టుకుని మరీ మైదానంలోకి వచ్చి జట్టును గెలిపించాడని గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు. విజయంల కోసం అంత పోరాట పటిమ ప్రదర్శించిన కుంబ్లే ఇప్పుడు ఎందుకు నిలబడలేకపోయాడని గవాస్కర్ విచారం వ్యక్తం చేశాడు. అనిల్ పోరాటాన్ని కొనసాగించకుండా మధ్యలోనే వదిలేయడం తన జీవితంలో ఇదే తొలిసారి అని గవాస్కర్ చెప్పాడు.
 
మెతకగా ఉండే కోచ్‌ను ఆటగాళ్లు కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ మీరు బాగా అలసిపోయారు కాబట్టి ప్రాక్టీస్‌ అవసరం లేదు. సెలవు తీసుకోండి లేదా షాపింగ్‌కు వెళ్లండి అని చెప్పే కోచ్‌ వారికి కావాలేమో. తీవ్రంగా సాధన చేయించి ఫలితాలు రాబట్టే కోచ్‌ వారికి అవసరం లేదు. నిజంగా కోచ్‌ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని జట్టులోంచి తీసేయాలి అంటూ గవాస్కర్ టీమిండియాలో జరుగుతున్న ధోరణులపై మండిపడ్డాడు.
 
గవాస్కర్ వ్యాఖ్యలు అలా ఉంచితే, సౌమ్యుడు, అంకిత భావానికి నిదర్శనంగా కనిపించే కుంబ్లే అవమానకరంగా రాజీనామా చేయడంపై నెటిజన్లు కెప్టెన్ కోహ్లీపై, బీసీసీపై విరుచుకు పడుతున్నారు. కోహ్లీని ముందుగా జట్టునుంచి సాగనంపి ధోనీని కెప్టెన్ చేయండి అంతా కుదురుకుంటుంది అని నెటిజన్లు మండిపడుతున్నారు.