శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

అనురాగ్ ఠాకూర్ వెటకారపు మాటలు... సుప్రీం తీర్పుపై ఏమన్నారంటే...

సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధ్యక్ష పదవిని కోల్పోయిన అనురాగ్ ఠాకూర్ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. 'మాజీ న్యాయమూర్తుల మార్గదర్శకత్వంలో క్రికెట్‌ పరిపాలన మెరుగ్గా ఉంటుందంటే వారికి ఆల్‌ ది బెస్ట్‌' అంటూ

సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధ్యక్ష పదవిని కోల్పోయిన అనురాగ్ ఠాకూర్ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. 'మాజీ న్యాయమూర్తుల మార్గదర్శకత్వంలో క్రికెట్‌ పరిపాలన మెరుగ్గా ఉంటుందంటే వారికి ఆల్‌ ది బెస్ట్‌' అంటూ వెటకారం ధ్వనించేలా మాట్లాడారు. 
 
జులై 18, 2015న సుప్రీకోర్టు వెలువరించిన తీర్పునకు అనుగుణంగా నడుచుకోకుండా, జస్టీస్ లోథా కమిటీ సిఫార్సు చేసిన సంస్కరణల అమల్లో జాప్యం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, కార్యదర్శి అజయ్‌ షిర్కేలపై సుప్రీంకోర్టు సోమవారం వేటువేసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై అనురాగ్ స్పందిస్తూ.. 'ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు. క్రీడాసంఘం స్వయం ప్రతిపత్తి కోసం చేసింది. ఒక పౌరుడిలా నేనూ సుప్రీంకోర్టును గౌరవిస్తా. మాజీ న్యాయమూర్తుల నేతృత్వంలో బీసీసీఐ మెరుగవుతుందంటే వారికి ఆల్‌ ది బెస్ట్‌. వారి మార్గదర్శకత్వంలో భారత క్రికెట్‌ వర్ధిల్లుతుందని నమ్మకముంది. కొన్నేళ్ల పాటు దేశ క్రికెట్‌కు సేవ చేసే గౌరవం నాకు లభించింది. 
 
ఆటలో అభివృద్ధి, పరిపాలన పరంగా బీసీసీఐ అత్యుత్తమ దశను చవిచూసింది. బీసీసీఐ సాయంతోనే ఆయా రాష్ట్రాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. ప్రపంచంతో పోలిస్తే దేశంలోనే అత్యంత నాణ్యమైన ఆటగాళ్లున్నారు. ఎప్పటికైనా బీసీసీఐయే దేశంలో అత్యుత్తమ క్రీడా సంఘం' అని ఠాకూర్‌ కామెంట్స్ చేశారు.