నా అభిమాన టెస్ట్ క్రికెట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకరు : గంగూలీ ప్రశంసలు
టీమిండియా కెప్టెన్, చిచ్చర పిడుగు విరాట్ కోహ్లీ మైదానంలో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అటు టెస్టుల్లోనూ అద్భుతంగా రాణిస్తూ, ఇటు వన్డేలలో సైతం చెలరేగిపోతున్నాడు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ తన ఫే
టీమిండియా కెప్టెన్, చిచ్చర పిడుగు విరాట్ కోహ్లీ మైదానంలో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అటు టెస్టుల్లోనూ అద్భుతంగా రాణిస్తూ, ఇటు వన్డేలలో సైతం చెలరేగిపోతున్నాడు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ తన ఫేవరెట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడంటూ పొగడ్తల వర్షాన్ని కురిపించాడు. కోహ్లీ అసాధారణ ఆటగాడని పేర్కొన్న ''దాదా'' అతి తక్కువ సమయంలోనే దేశానికి ఎన్నో అద్భుతాలు అందించాడని ఆకాశానికెత్తేశాడు.
మైదానంలో పోరాటస్ఫూర్తితో కనిపించే కోహ్లీ భారత్ క్రికెట్ విలువను అమాంతం పెంచేశాడని కితాబునిచ్చాడు. అంతేకాదు భారత క్రికెట్కు దొరికిన గొప్ప ఆస్తి కోహ్లీ అంటూ కొనియాడాడు. విజయకాంక్షతో రగిలిపోయే విరాట్ దేశానికి ఎంతో అవసరమైన క్రికెటర్ అని గంగూలీ పేర్కొన్నాడు. బ్యాటింగ్ చేయడానికి వెళ్లినపుడు, కెప్టెన్గా ఫీల్డ్లో ఉన్నపుడు బెస్ట్గా ఉండాలనే కోహ్లి చూస్తాడని, టీమ్కు అతని అవసరం చాలా ఉందని దాదా అభిప్రాయపడ్డాడు.
ఇక, భారత-న్యూజిలాండ్ మధ్య త్వరలో మొదలయ్యే టెస్టు సిరీస్ గురించి మాట్లాడిన గంగూలీ.. ప్రస్తుతం ఇంగ్లండ్ తర్వాత రెండో ఉత్తమ జట్టు న్యూజిలాండేనని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా కంటే న్యూజిలాండ్ స్పిన్ను మెరుగ్గా ఆడగలదని గంగూలీ చెప్పాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కివీస్ సాంకేతికంగా మెరుగుదలను సాధించిందని చెప్పాడు.
కానీ, స్వదేశంలో భారత్ను ఓడించడం అంత సులభం కాబోదన్న విషయం కివీస్తో పాటు అందరికీ తెలుసన్నాడు. ఆస్ట్రేలియా కంటే స్పిన్నర్లను బాగా ఎదుర్కొనే కివీస్తో జాగ్రత్తగా ఉండాలని టీమిండియాను హెచ్చరించాడు. ఈ నెల 22 నుంచి కోహ్లీ కెప్టెన్సీలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో తలపడనుంది టీమిండియా.