శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (06:38 IST)

కెప్టెన్ అయితే కొమ్ములొస్తాయా? అందుకే మరింత బాధ్యతగా ఆడుతున్నా అన్న కోహ్లీ

భారత జాతీయ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా తనలో అలసత్వానికి చోటు లేదని, అందుకే సాధారణ బ్యాట్స్‌మన్‌గా ఉన్నప్పటికంటే ఎక్కువగా పరుగులు తీయడానికి ప్రయత్నిస్తుంటానని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా వరుసగా నాలుగు డబుల్ సెంచరీ

భారత జాతీయ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా తనలో అలసత్వానికి చోటు లేదని, అందుకే సాధారణ బ్యాట్స్‌మన్‌గా ఉన్నప్పటికంటే ఎక్కువగా పరుగులు తీయడానికి ప్రయత్నిస్తుంటానని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా వరుసగా నాలుగు డబుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ రెండోరోజు కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. 
 
వ్యక్తిగత మైలురాళ్లకంటే ముందుగా జట్టు ప్రయోజనాలకే అగ్రతాంబూలం ఇచ్చే నిజమైన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తన బాధ్యతలు ఇప్పుడు మరింత పెరిగాయని చెప్పాడు. కెప్టెన్‌గా తనపై ఉన్న బాధ్యతే తనలో అలసత్వం చొరబడకుండా చేస్తోందని అదే తనలో పరుగుల దాహాన్ని మరింతగా పెంచుతోందని కోహ్లీ తెలిపాడు. 
 
సాధారణ బ్యాట్స్‌మన్‌గా ఉన్నప్పటికంటే కేప్టెన్ గా ఉన్నప్పుడే మరింత బాగా ఆడాల్సి ఉంది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అలసత్వానికి చోటే ఇవ్వకూడదని సూచించాడు. అందుకే గతంలో కంటే ఇప్పుడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలన్న తపన నాలో పెరుగుతోంది. నా క్రికెట్ కెరీర్లో తొలి ఏడెనిమిది సెంచరీల్లో 120 పరుగులు కూడా నేను సాధించలేకపోయానని కోహ్లీ గుర్తు చేశాడు
 
సుదీర్ఘకాలం బ్యాటింగ్ చేయాలన్న సంకల్పాన్ని నేను విధించుకున్నతర్వాత నా ఉద్వేగాన్ని పూర్తిగా నియంత్రించుకున్నాను. అలసత్వానికి అసలు తావు ఇవ్వడం లేదు. పైగా నా ఫిట్‌నెస్‌పై ఎంతో కష్టపడుతున్నాను. నేనిప్పుడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలనని అనుకుంటున్నాను. మునుపటిలా ఇప్పుడు నేను అలసిపోవడం లేదు అని కోహ్లీ చెప్పాడు. 
 
గతంలో టెస్ట్ క్రికెట్‌కు నేనెంతో ప్రాధాన్యమిచ్చేవాడిని. కాని ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌ను కూడా ఇతర క్రికెట్ గేమ్‌లలాగే చూస్తున్నాను. మునుపటిలా వందపరుగులు సాదించగానే నేనిప్పుడు పెద్దగా సంతృప్తి చెందడం లేదు. నా జట్టు అవసరాలకు అనుగుణంగానే నేను ఇప్పుడు వ్యవహరిస్తున్నాను అని కోహ్లీ వివరించాడు.
 
మేము ఇప్పుడు ఆడుతున్న తరహా క్రికెట్‌ను చూసినట్లయితే ఈరోజుల్లో క్రికెట్‌ ఆడటం అంత సులభమైన విషయం కాదు. అది మానసిక సంబంధమైన విషయమే. సెషన్లలో నీవు పెద్దగా ప్రాక్టీస్ చేయనవసరం ఉండకపోవచ్చు. కానీ ఈ గేమ్‌లో నీవు ఏం చేయబోతున్నావు అనే విషయమై మానసికంగా సన్నద్ధం కావల్సిన అవసరం ఉంది. క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో నేను జట్టుకు దోహద పడాలని  కోరుకుంటున్నాను. ఈ ఆలోచనే నా మైండ్‌సెట్‌ను పూర్తిగా ఆక్రమిస్తోంది. అందుకే నేను ఆటకు పూర్తిగా ప్రత్యేకంగా సంసిద్ధం కావలసి ఉంది.