శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (13:51 IST)

భారత్ - ఆస్ట్రేలియా తొలి టెస్ట్ సందేహమే : హ్యూస్ మృతి వల్లే!!

వచ్చే నెల నాలుగో తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ నిర్వహణ సందేహంగా మారింది. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ విషాద మరణం నేపథ్యంలో ఈ టెస్ట్ నిర్వహణపై సందేహం నెలకొంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన చేసింది. హ్యూస్ మరణం తాలుకు విషాద ఛాయల నుంచి తమ ఆటగాళ్లు ఇంకా కోలుకోలేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు.
 
పైగా హ్యూస్ మరణానికి సంతాప సూచకంగా తొలి టెస్టును రద్దు చేస్తే బాగుంటుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. ఇప్పటికే హ్యూస్ మృతితో భారత్, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య శుక్ర, శని వారాల్లో జరగాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేసిన విషయం తెల్సిందే. అలాగే, బ్రిస్బేన్ టెస్టును రద్దు చేసే యోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, దేశవాళీ మ్యాచ్ ఆడుతుండగా బౌలర్ వేసిన బౌన్సర్‌కు హ్యూస్ మెదడుకు తగిలి తీవ్ర గాయం కావడంతో రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన విషయం తెల్సిందే. దక్షిణ ఆస్ట్రేలియా - న్యూ సౌత్ వేల్స్‌ల మధ్య జరిగిన దేశవాళీ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బంతి హ్యూస్ మెడను బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది.