విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనకు బీసీసీఐ కారణం : విమర్శకులు!
ప్రస్తుత ఇంగ్లండ్ పర్యనటలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలం కావడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్లో కేవలం 101 పరుగులు చేసిన కోహ్లీ తన కెరీర్లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్నారు.
అయితే, ఈ సిరీసీలో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వైఫల్యానికి బీసీసీఐ కారణమని క్రికెట్ విమర్శకులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా... వారి వాదనకు క్రీడాభిమానులు సైతం వంత పాడుతున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... బీసీసీఐ నియమనిబంధనల ప్రకారం విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు... క్రికెటర్లతో పాటు కేవలం వారి భార్యలకు మాత్రమే అనుమతి ఇస్తారు. పెళ్లికాని క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ను విదేశీ టూర్లకు తీసుకువెళ్లడం బీసీసీఐ నియమావళికి విరుద్ధం.
అయితే కోహ్లీ ఇంగ్లండ్ టూర్కు తనతో పాటు అనుష్కశర్మను తీసుకువెళతానంటే... ఏమాత్రం ఆలస్యం లేకుండా... ఆలోచన చేయకుండా బీసీసీఐ అనుమతి ఇచ్చేసింది. బీసీసీఐ అనుమతి కారణంగా ఇంగ్లండ్ టూర్లో అనుష్కశర్మతో కలిసి కోహ్లి హాయిగా షికార్లు చేస్తున్నాడు. అనుష్క శర్మతో ప్రేమ కలాపాల్లో మునిగిపోవడం వల్లే... కోహ్లి ఇంగ్లండ్ టూర్లో రాణించలేకపోతున్నాడని క్రీడాపరిశీలకులతో పాటు అభిమానులు కూడా వాపోతున్నారు. కీలకమైన ఇంగ్లండ్ టూర్లో కోహ్లీతో పాటు ఉండటానికి అనుష్కశర్మకు ఎలా అనుమతి ఇచ్చారని వారు బీసీసీఐను ప్రశ్నిస్తున్నా.. అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేక పోవడం గమనార్హం.