భారత్ - ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ డ్రా!
అందరూ ఊహించినట్టుగానే జరిగింది. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్లో ఇరు జట్ల టెయిల్ఎండ్ బ్యాట్స్మెన్లు సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పడంతో ఈ మ్యాచ్ ఎలాంటి ఫలితం తేలకుండానే పేలవంగా ముగిసింది.
ఈ మ్యాచ్ చివరి రోజైన ఆదివారం 3 వికెట్లు కోల్పోయి 167 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఐదో రోజు రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత్... ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసింది. భారత టెయిల్ ఎండ్ బ్యాట్స్మెన్లు స్టువర్ట్ బిన్నీ 78, భువనేశ్వరి కుమార్ 63, ఇషాంత్ శర్మ 13 చొప్పున పరుగులు చేసి మ్యాచ్ డ్రా అయ్యేందుకు కీరకంగా మారింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో విజయ్ 52, ధవాన్ 29, పుజారా 55, రెహానే 24, ధోనీ 11, జడేజా చొప్పున పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ మూడు, బ్రాండ్ 2, స్టోక్స్ 2, ఫ్లుంకెట్, అలీలు ఒక్కో వికెట్ చొప్పున పడొగొట్టారు.
అంతకుముందు..ఇంగ్లండ్ జట్టు నాల్గో రోజు 9 వికెట్ల నష్టానికి 352 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్సింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ చివరి వికెట్టుకు అత్యధిక పరుగుల రికార్డు నమోదు చేసి భారత్ బౌలర్లకు షాక్ ఇచ్చింది. 298 పరుగుల వద్ద 9 వికెట్టును కోల్పోయిన తరుణంలో ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు రూట్ చెలరేగిపోయాడు. దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 498 పరుగులు సాధించింది. కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేసిన విషయం తెల్సిందే.