జెస్సీ రైడర్ : 39 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు!
వివాదాస్పద న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ మరోమారు తన బ్యాట్కు పని చెప్పాడు. జట్టులో బ్యాడ్బాయ్గా పేరు తెచ్చుకున్న ఈ ఆటగాడు.. తన చేష్టల కారణంగా గత ఫిబ్రవరి నుంచి జట్టుకు దూరమయ్యాడు. దీంతో తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ఇందులోభాగంగా దేశవాళీ క్రికెట్ పోటీల్లో పాల్గొంటూ అమితంగా రాణిస్తున్నాడు. తాజాగా వెల్లింగ్టన్లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. సొంత దేశవాళీ జట్టు ఒటాగో తరపున ఆడిన రైడర్ ఆ పోరులో మొత్తం 57 బంతుల్లో 8 సిక్సులు, 18 ఫోర్లతో 136 పరుగులు చేసి సెలక్టర్లను ఆకర్షించాడు.
అంతేకాకుండా, ఈ మెరుపు ఇన్నింగ్స్తో తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పని పరిస్థితిని కివీస్ క్రికెట్ బోర్డు సెలక్టర్లకు కల్పించాడు. ప్రస్తుతం కివీస్ సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓటమిపాలవడంతో, రెండో వన్డేకు పటిష్టమైన జట్టును రంగంలోకి దింపాలని సెలక్టర్లు భావిస్తున్న తరుణంలో జెస్సీ రైడర్ ఫామ్లోకి రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు.