చాంపియన్స్ లీగ్ టీ-20 : సెమీస్ రేసులో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్
స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా గ్రూపు - ఏ విభాగంలో పెర్త్ స్కార్చర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది. సెమీస్ రేసులో నిలవాలంటే విజయం తప్పనిసరైన తరుణంలో ధోనీ సేన ఘనం విజయం సాధించి రేసులో నిలిచింది.
శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై 13 పరుగులతో అద్భుత విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పెర్త్ ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్లకు 142 రన్స్ మాత్రమే చేసింది. కల్టర్ నైల్ (30) కెప్టెన్ ఆడమ్ వోజెస్ (27), ఆస్టన్ టర్నర్ (22) రాణించినా ఫలితం దక్కలేదు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 155 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (28 బంతుల్లో 44 నాటౌట్), కెప్టెన్ ధోనీ (16 బంతుల్లో 4 సిక్సర్లతో 35), డ్వేన్ బ్రావో (27) రాణించారు. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.