శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (13:36 IST)

సచిన్‌ కాళ్లకు మొక్కమని ఒత్తిడి చేశారు : విరాట్ కోహ్లీ కామెంట్స్

తాను జట్టులోకి వచ్చిన కొత్తల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కాళ్ళు మొక్కని ఇతర జట్టు సభ్యులు ఒత్తిడి చేశారని దీంతో తాను సచిన్ వద్దకు వెళ్లి నిలబడగా... అలాంటిదేమీ లేదనీ, సీనియర్ ఆటగాళ్లు ఆటపట్టిస్తున్నారంటూ టెండూల్కర్ చెప్పారని భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన గత అనుభవాలను వెల్లడించారు. 
 
కలర్స్ ఛానెల్‌లో ప్రసారమయ్యే పాపులర్ ప్రోగ్రామ్ కామెడీ నైట్స్ విత్ కపిల్‌లో విరాట్ కోహ్లీ సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో ఇండియన్ క్రికెట్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఈ యువ క్రికెటర్ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా తన తొలి రోజులను కోహ్లీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. జట్టులోకి కొత్తగా ఎవరొచ్చినా సచిన్ కాళ్లకు మొక్కాల్సిందేనని సీనియర్ ఆటగాళ్లు తనకు చెప్పారని... తాను అది నిజమేననుకుని సచిన్ వద్దకు వెళ్లి ఆయన కాళ్లు మొక్కేందుకు నిలబడ్డానని... అయితే సచిన్ అదేమి అవసరం లేదని, సీనియర్ ఆటగాళ్లు నన్ను ఆటపట్టిస్తున్నారని తెలిపాడని కోహ్లి వివరించాడు. 
 
ఇకపోతే.. భారత క్రికెట్ జట్టుతో తన ఆరేళ్ల ప్రయాణంపై కోహ్లీ స్పందిస్తూ... జట్టులో ఇషాంత్ శర్మ మంచి భోజన ప్రియుడని చెప్పాడు. ఇక రోహిత్ శర్మకు నిద్రపోవడమంటే ప్రాణమని కోహ్లీ అన్నాడు. అవకాశం లభిస్తే రోహిత్ శర్మ ఎక్కడైనా, ఎప్పుడైనా కునుకు తీస్తాడని కోహ్లీ అన్నాడు. ప్రస్తుత జట్టులో ఛటేశ్వర్ పూజారీ అత్యంత బుద్ధిమంతుడన్నాడు. అమ్మాయిలంటే పూజారా విపరీతంగా సిగ్గుపడిపోతాడని కోహ్లీ అన్నాడు. 
 
పేరుకు తగ్గట్టే పూజారా రోజుకి ఐదుసార్లు పూజ చేస్తాడని కోహ్లీ వివరించాడు. పూజారా భార్య పేరు కూడా పూజ కావడం విశేషమని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ షోలో టాలీవుడ్ బ్యూటీ, తన ప్రియురాలు అనుష్క శర్మతో ఉన్న ప్రేమాయణం గురించి అడిగినప్పడు కోహ్లీ సిగ్గుపడుతూ సమాధానాన్ని దాటవేశాడు.