శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : ఆదివారం, 14 జూన్ 2015 (11:26 IST)

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఏసీబీ నమోదు చేసిన కేసు సరైనదేనా?

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన సెక్షన్లు సరైనవేనా? అనే అంశంపై న్యాయ నిపుణులు, రాజకీయ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సాధారణంగా ప్రజా ప్రతినిధిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయవచ్చా? ఒకవేళ చేస్తే సదరు సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసు చెల్లుబాటవుతుందా? అన్న సందేహాలు అటు న్యాయవర్గాల్లోనే కాక ఇటు రాజకీయ వర్గాలూ వ్యక్తం చేస్తున్నాయి. 
 
సాధారణంగా అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులు పబ్లిక్ సర్వెంట్లకు మాత్రమే వర్తిస్తాయి. అయితే రేవంత్ రెడ్డి పబ్లిక్ సర్వెంట్ కాదు, అంతేకాక ప్రభుత్వంలో పదవి ఉన్న నేతా కాదు. మరి పబ్లిక్ సర్వెంట్ కాని రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు చెల్లుబాటు అవుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
 
ప్రజా ప్రతినిధులు కూడా పబ్లిక్ సర్వెంట్లేనన్న సుప్రీంకోర్టు తీర్పులను అస్త్రంగా చేసుకున్న ఏసీబీ, ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రజా ప్రతినిధిగా రేవంత్ రెడ్డిని పబ్లిక్ సర్వెంట్ కిందే పరిగణించినా, అధికార దుర్వినియోగం అన్న పదం ఈ కేసులో వినపడదు. ఎందుకంటే, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడిన దాఖలా లేదు. 
 
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటు కోసం డబ్బిచ్చినా, తీసుకున్నా ఐపీసీ సెక్షన్ 171బి, 171ఈ కింద కేసు నమోదు చేయాలి. ఈ తరహా కేసుల్లో నిందితులకు స్టేషన్ బెయిలే లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అనుమతితో ఓటుకు నోటు ఇవ్వజూపిన వ్యక్తిపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(1) కింద కేసు నమోదు చేయాలి. దీనిని ఎన్నికల పిటిషన్‌గా హైకోర్టులోనే దాఖలు చేయాల్సి ఉంది. 
 
ఈ తరహా కేసులో అరెస్టుల మాట ఉండదు. కేవలం అనర్హతకు సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో పోలీసుల పాత్ర ఏమాత్రం ఉండదు. అయితే రేవంత్ కేసులో ఈ రెండు సెక్షన్లను ఏసీబీ అధికారులు విస్మరించారు. రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలన్న వ్యూహాత్మక నిర్ణయంతోనే సదరు సెక్షన్లను పక్కనబెట్టిన ఏసీబీ అధికారులు, ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను ఇరికించాలన్న కక్షతో ఈ పని చేసినట్టు తెలుస్తోంది.