శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : బుధవారం, 12 నవంబరు 2014 (18:32 IST)

టి. ట్యాంక్ బండ్ తలదన్నేలా కృష్ణా రివర్ బేంక్ వద్ద ఏపీ రాజధాని

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కృష్ణా నదికి ఇరువైపులా అనే వార్తలు రోజురోజుకీ బలపడుతున్నాయి. హైదరాబాదులో ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ కు తెలుగు కవులు, మహనీయులు, రాజుల విగ్రహాలను ప్రతిష్టించి నూతన శోభను తెచ్చారు. ఎన్టీఆర్ ఆనాడు తీసుకున్న ఆ నిర్ణయంతో హైదరాబాద్ నగరం కొత్త అందాన్ని సంతరించుకున్నది. 
 
ఇపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని కృష్ణా నదికి ఇరువైపులా ఉండేట్లు నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయన పలు ప్రాంతాలను ఇందుకు అనువుగా ఉంటాయని సూచించినట్లు చెపుతున్నారు.

 
ప్రభుత్వంలో ప్రధానమైన శాసనసభ, సచివాలయం, ముఖ్యమంత్రి అధికార నివాసం, రాజ్‌భవన్‌ తదితర భవన సముదాయాలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేయనున్న 18 గ్రామాల్లోని 30 వేల ఎకరాల్లోనే ప్రధానమైన కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
 
ఇవి కూడా కృష్ణానదికి సమీపంలో ఉన్న తాళ్లాయపాలెం, ఉద్దండరాయని పాలెం, మందడం, లింగాయపాలెం, వెంకటాయపాలెం, రాయపూడి, బోరుపాలెం తదితర గ్రామాల్లోనే ప్రభుత్వ భవనాలను నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే విదేశీ అతిథులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు తదితర ముఖ్య సమావేశాల్లో పాల్గొనాలంటే నదికి ఆనుకుని ఉండేట్లు కట్టడాలను నిర్మిస్తే బావుంటుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 
 
మొత్తంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అందాలను మించి మరింత సుందర నగరాన్ని తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నది ఒడ్డు నుంచి 400 మీటర్లను వదలివేసి ఎనిమిది లైన్ల రహదారులతోపాటు పార్కులు, వర్తకవాణిజ్య సముదాయాలు ఇతర ఎంటర్టైన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.