ఏపీలో బీజేపీ పాగా: రెడ్డిలకు కాషాయం. కిరణ్తో వెంకయ్య చర్చలు?!
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పాగా వేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా రెడ్డిలకు కాషాయం తగిలించేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ఏపీలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తన సత్తా చాటిన బీజేపీ.. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలపై కన్నేసింది. ఇప్పటికే తెలంగాణలో అమిత్ షాను రంగంలోకి దింపిన బీజేపీ, ఏపీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఏపీలో రెడ్డి సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకుని 2019 కల్లా ఇక్కడ టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ చూస్తోంది.
ఇందుకోసం పక్కా ప్రణాళిక వేసిన బీజేపీ... పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాం మాధవ్కు ఏపీ ఇన్ ఛార్జ్గా బాధ్యతలు అప్పగించింది. ఇక నుంచి ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతంచేసే వ్యవహారాలను ఆయనే పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారని సమాచారం.
విభజన అనంతరం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి నేతలు ఏపీలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అటు, వైసీపీ నేతలు కూడా అయోమయంలో ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకుని రెడ్డి వర్గాన్ని బీజేపీ వైపుకు తిప్పుకుంటే ఏపీలో పార్టీకి గట్టి పునాది పడుతుందనేది బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు.
ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, ఇంకా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రెడ్డివర్గం నుంచి ప్రముఖ నేతలున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, కర్నూలుకు చెందిన మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలతో బీజేపీ అగ్రనేతలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆనం సోదరులు, కోట్లతో ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయని, కచ్చితంగా తమ ప్రయత్నాలు ఫలిస్తాయని బీజేపీ భావిస్తోంది. ఇక, చిత్తూరుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా చర్చించనున్నారట. ఈ క్రమంలో రానున్న రోజుల్లో వారితో మాట్లాడి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
ఇటీవల జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాపు కమ్యూనిటీ మద్దతిచ్చిందని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో కొంతవరకు ఏపీలో విజయం సాధించామని బీజేపీ అనుకుంటోంది.
తత్ఫలితంగానే తమ పార్టీ నేత పి.మాణిక్యాలరావుకు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కిందని భావిస్తోంది. ఏది ఏమైనా బీజేపీ ఇరు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని తద్వారా స్థానిక పార్టీల మద్దతును కోరాలనే అవసరం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.