గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (11:44 IST)

#GujaratVerdict : బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణాలివే...

సర్వత్రా ఆసక్తిరేకెత్తించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లను గెలుచుకుని వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

సర్వత్రా ఆసక్తిరేకెత్తించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లను గెలుచుకుని వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ మరోమారు విపక్షంలో కూర్చోనుంది. ఈ పార్టీకి 80 సీట్లు వచ్చాయి. 
 
గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గత 22 యేళ్లుగా అధికారంలో ఉంది. అయితే, గత మూడు ఎన్నికల నుంచి బీజేపీకి సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2007 ఎన్నికల్లో 117 సీట్లు సాధించిన బీజేపీ 2012లో 115 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడైతే 100 మార్కును కూడా అందుకోలేక పోయింది. 2012 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా 16 సీట్లు తగ్గాయి. 
 
అదేసమయంలో కాంగ్రెస్‌ తన ఫలితాను మెరుగుపరుచుకుంటూ వస్తోంది. 2007లో 59 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌.. 2012లో 61 సీట్లలో విజయం సాధించింది. ఈసారి 80 స్థానాల్లో నెగ్గి.. తన స్థానాన్నికొంతవరకు మెరుగుపరచుకుంది. గత ఎన్నికల కంటే ఈసారి 19 సీట్లు ఎక్కువగా కైవసం చేసుకోవడం గమనార్హం. అయితే, బీజేపీకి సీట్లు తగ్గి, కాంగ్రెస్‌ పార్టీకి సీట్లు పెరగడం వెనుకగల కారణాను పరిశీలిస్తే, 
 
గత యేడాది ప్రధాని మోడీ దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేశారు. ఈ నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో పరిశ్రమలు మూతపడి, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇలాంటివారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. 
 
ఇకపోతే, ఈ యేడాది జులై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఈ పన్ను విధానంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. జీఎస్టీతో ధరలు తగ్గుతాయని ఆశించిన ప్రజలకు ఆశాభంగం ఎదురవడంతో ఓట్ల బీజేపీకి వ్యతిరేకంగా మారారు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఓటేసినట్లు ఫలితాల సరళి స్పష్టంచేసింది.
 
చివరగా, పటేల్‌ రిజర్వేషన్ ఉద్యమం కూడా బీజేపీ ఓటు బ్యాంకుకు గండికొట్టింది. యువనేత హర్దిక్‌ పటేల్‌ నేతృత్వంలోని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్ సమితి కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. పటేల్స్‌ బీజేపీకి వ్యతిరేకంగా మారడంతో ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు పెంచుకోవడానికి కొంతమేరకు కలిసివచ్చింది. ఈ మూడు అంశాలు బీజేపీకి సీట్లు తగ్గేలా చేశాయి.