శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 24 ఏప్రియల్ 2017 (17:22 IST)

శ్రీవారి ఆస్తులను వాడేస్తున్న పోలీసులు... ఇదేమిటి గోవిందా...?

లీజు. అంటే తెలుసుగానీ పోలీజు అంటే ఏమిటి..?ఇదేదో కొత్త పదంగా ఉందే అనిపిస్తోంది కదూ. నిజమే ఇది కొత్త పదమే. ఇప్పటిదాకా ఎప్పుడూ, ఎక్కడా పోలీజు అనే పదాన్ని విని ఉండకపోవచ్చు. భూములను, భవంతులను లీజుకు ఇవ్వడం తెలిసిందే. యజమానుల ఇష్టం మేరకే లీజుకు ఇస్తారు.

లీజు. అంటే తెలుసుగానీ పోలీజు అంటే ఏమిటి..?ఇదేదో కొత్త పదంగా ఉందే అనిపిస్తోంది కదూ. నిజమే ఇది కొత్త పదమే. ఇప్పటిదాకా ఎప్పుడూ, ఎక్కడా పోలీజు అనే పదాన్ని విని ఉండకపోవచ్చు. భూములను, భవంతులను లీజుకు ఇవ్వడం తెలిసిందే. యజమానుల ఇష్టం మేరకే లీజుకు ఇస్తారు. యజమానికి ఇష్టం లేకుండా లీజుకు ఇవ్వరు. అయితే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆస్తులను టిటిడికి ఇష్టం లేకపోయినా పోలీసు శాఖ అనుభవిస్తోంది. మా బిల్డింగులు మాకు ఇవ్వండి మొర్రో అంటున్నా ఇవ్వడం లేదు. అందుకే దీనికి పోలీజు అని పేరుపెట్టాం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం.
 
ఏడేళ్ళ క్రితం వరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా మొత్తానికి ఒకరే ఉండేవారు. ఎస్పీ ఆఫీసు చిత్తూరులో ఉండేది. ఎస్పీ అక్కడే ఉండేవారు. తిరుపతికి ఉన్న ప్రాధాన్యతరీత్యా ఇక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎస్పీ తరచూ తిరుపతికి వచ్చేవారు. క్యాంపు కార్యాలయం నుంచి పనులు చక్కబెట్టేవారు. ఇందుకోసం మహిళా పాలిటెక్నిక్ కాలేజీ వద్ద తితిదే ఓ భవంతిని పోలీసు శాఖ సొంతంగా కార్యాలయం నిర్మించుకోవాల్సింది. తితిదే భవంతి ఉంది కాబట్టి అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఏడేళ్ళ క్రితం జిల్లాను రెండు భాగాలుగా చేసి తిరుపతి ప్రాంతానికి ప్రత్యేకంగా ఎస్పీని నియమించారు. దీంతో చిత్తూరు ఎస్పీ తిరుపతికి రావాల్సిన అవసరం తీరిపోయింది. 
 
క్యాంపు కార్యాలయం అవసరం లేకుండా పోయింది. అయినా ఆ భవంతిని తితిదేకి స్వాధీనం చేయలేదు. ఏడేళ్ళుగా చిత్తూరు ఎస్పీ ఆధీనంలోనే ఉంది. దాన్ని అతిథి గృహంలాగా వినియోగించుకుంటున్నారు. ముగ్గురు కానిస్టేబుళ్ళను నియమించారు. క్యాంపు కార్యాలయం మూసి వేసిన నేపథ్యంలో బిల్డింగ్‌ను తమకు అప్పగించాలని తితిదే కోరినా పోలీసులు ఏవేవో కారణాలు చూపి తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ బిల్డింగ్ పైన పోలీసు ఉన్నతాధికారుల కన్ను బడినట్లు తెలుస్తోంది. చిత్తూరు ఎస్పీ ఆధీనంలోని భవనాన్ని తమకు అప్పగించాలని ఉన్నతాధికారులు కోరినట్లు సమాచారం. 
 
తిరుపతి బస్టాండ్‌కు సమీపంలో గాంధీ కూడలి వద్ద ఎస్వీ గెస్ట్ హౌస్ ఉంది. ఇందులో కొంత భాగాన్ని చాలా యేళ్ళ క్రితం ఈస్ట్ పోలీస్టేషన్ కోసం ఇచ్చారు. ఈ మధ్య దీనికి ఎదురుగానే పోలీస్టేషన్ కోసం అద్భుతమైన భవనాన్ని నిర్మించారు. పోలీస్టేషన్‌ను అందుబాటులోకి తరలించారు. అదేవిధంగా టిపి ఏరియాలో టిటిడి భవనంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉండేది. క్రైం పోలీస్టేషన్‌కు సమీపంలో కొత్త భవనం నిర్మించి, ట్రాఫిక్ స్టేషన్‌ను అందులోకి మార్చారు. అవసరం తీరిపోయినా పాత భవనాలను తితిదే అప్పగించలేదు. ఏవేవో అవసరాలు చూపిస్తూ తమ ఆధీనంలోకి ఉంచుకున్నారు. 
 
తిరుపతిలో నూతనంగా ఎస్పీ కార్యాలయం ఏర్పాటయినప్పుడు ప్రకాశం రోడ్డులోని పాత ఎస్వీ హైస్కూల్ భవనాన్ని పోలీసు శాఖకు అప్పగించారు. ఇప్పుడు కూడా ఎస్పీ కార్యాలయం ఇక్కడే కొనసాగుతోంది. తిరుపతి ఎస్పీ, ఎఎస్పీలు నివాసం ఉంటున్న భవనాలూ తితిదేవే. అవసరమైన భవనాలను పోలీసు శాఖ వాడుకుంటే తప్పులేదుగానీ అవసరం తీరిపోయినా వాటిపైనా తితిదేకి అప్పగిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఆ భవనాలను భక్తుల సౌకర్యార్థం మరమ్మత్తులు చేయడమో లేక అక్కడ కొత్త భవనాలు నిర్మించడమో ఏదో ఒకటి చేసి భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తితిదే అధికారులు అంటున్నారు. మరి పోలీసు శాఖ స్పందిస్తుందా.. ఆ భవనాలను స్వామికి అప్పగిస్తుందా? వేచి చూడాల్సిందే.