శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (14:21 IST)

గుజరాత్‌లో బీజేపీని గెలిపించిన మణిశంకర్ అయ్యర్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ మరోమారు విజయభేరీ మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంద

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ మరోమారు విజయభేరీ మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే, గుజరాత్‌లో బీజేపీని కాంగ్రెస్ నుంచి సస్పెండ్‌కు గురైన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ గెలిపించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
నిజానికి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఇందుకోసం కుల రాజకీయాలను తెరపైకి తెచ్చింది. పటీదార్లతో ముస్లిం, దళిత వర్గాలకు చెందిన అగ్రనేతలను అక్కున చేర్చుకుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని 'నీచుడు', 'సభ్యత'లేని వాడు అంటూ మండిపడ్డారు. 
 
ఈ వ్యాఖ్యలతో బీజేపీకి మంచి పట్టుదొరికినట్టయింది. అప్పటివరకు చప్పగా సాగిన ప్రచారం మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో వేడిరాజుకుంది. అయ్యర్ వ్యాఖ్యలను ప్రధాని మోడీ పదేపదే ప్రస్తావిస్తూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ప్రజలను నీచులని అంటోందని ప్రధాని చేసిన ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. 
 
అలాగే, తనను చంపించేందుకు మణిశంకర్ అయ్యర్ పాక్‌తో కలిసి వ్యూహం రచించారని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా పాకిస్థాన్‌తో చేతులు కలిపి కాంగ్రెస్ తమను ఓడించాలని చూస్తుందని, అహ్మద్ పటేల్‌ను సీఎంను చేసేందుకు పాక్‌ సహకారంతో కుట్ర పన్నుతోందని మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.