గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (13:30 IST)

అవిశ్వాసంలో హైడ్రామా... ఎలాగో తెలుసా..?

ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ప్రత్యేక హోదా అంశం కాస్త ఇప్పుడు పార్టీల మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు మధ్య దూరం పెరుగుతుంటే, బీజేపీతో దగ్గరవ్వాలనుకున్న వైకాపాకు చివరకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా అవిశ్వాసం తెరపైకి వచ్చింది.
 
ఏకంగా కేంద్ర ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైపోయారు ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఒక కమిటీని ఏర్పాటు చేసి అధికార, ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. రెండు పార్టీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పిలుపునిచ్చారు. దీంతో వెంటనే జగన్ అవిశ్వాసానికి సై అన్నారు. 
 
ఇప్పటికైనా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా అవిశ్వాసం అంశం తెరపైకి రావడంతో ఏపీ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అంతేకాదు ఎంపీల రాజీనామా విషయాన్నే ఇప్పటివరకు తేల్చుకోలేకుండా తెదేపా సతమతమవుతుంటే వైకాపా ఎంపీలు మాత్రం రాజీనామాలకు సిద్ధమైపోయారు.
 
ఈ లెక్కన చూస్తుంటే అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీనే దూకుడును పెంచినట్లు కనిపిస్తోంది. కానీ ఇప్పటికే పలు కేసుల్లో ఇబ్బందుల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఒకవేళ బీజేపీకి దగ్గరైతే అవన్నీ సమసిపోయే అవకాశముందని గతంలో భావించారు. కానీ ఇప్పుడు ఏపీలో రగులుతున్న ప్రత్యేక హోదా పరిస్థితి దృష్ట్యా కేంద్రంపై తిరుగుబావుటా ఎగరేస్తేనే జనంలోకి మరింత చొచ్చుకు వెళ్ళడానికి సాధ్యం అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. 
 
అందుకే అవిశ్వాసం నినాదంతో చివరకు అదే మాటపై నిలబడ్డారు. ఇక తెలుగుదేశంపార్టీ మాత్రం ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతోంది. వైకాపా అవిశ్వాసం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమైపోయారు. ఇదే జరిగితే పార్లమెంటులో బీజేపీకి ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఏ మాత్రం లేదు. ఎందుకంటే మోడీ సర్కారులో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల బలంతో పని లేకుండా బీజేపీ ఒక్క పార్టీకే సంపూర్ణ మెజార్టీ ఉన్న విషయం తెల్సిందే.

అవిశ్వాసం తీర్మానం పెట్టాలంటే 57 మంది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎపికి సంబంధించి టిడిపి, వైసిపి పార్టీలకు చెందిన ఎంపీలు 25 మంది ఉన్నారు. అయినా సరే 57మందితో కేంద్రాన్ని కూల్చడం ఏమాత్రం సాధ్యం కాదు. ఇదంతా కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.