ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? ట్యాప్ చేస్తే విధించే శిక్ష ఏంటి?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోన్ ట్యాపింగ్పై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్పై గతంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే తన పదవిని కోల్పోయిన చరిత్ర ఉంది. అలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రకాలు, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారన్న అంశాన్ని పరిశీలిద్ధాం. ఈ ఫోన్ ట్యాపింగ్ రెండు రకాలు. ఒకటి చట్టబద్ధం. రెండోది చట్టవిరుద్ధం.
చట్టబద్ధంగా ట్యాపింగ్ ఎలా చేస్తారంటే..
మూడు నుంచి నాలుగు వర్క్స్టేషన్లు, డెస్క్టాప్ మానిటర్లు, హెడ్ఫోన్లతో కూడిన ఒక గది ఉంటుంది. ఇదంతా పూర్తిగా సీసీ టీవీ కెమెరా నిఘాలో ఉంటుంది. ఒకటి లేదా రెండు సర్వర్లు, రికార్డింగ్ పరికరాలు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు అందజేసే కేబుల్స్ ఉంటాయి. ఇందులోకి ప్రవేశం కూడా చాలా పరిమితంగా, బయోమెట్రిక్ వ్యవస్థతో ఉంటుంది. పరికరాలన్నీ దిగుమతి చేసుకున్నవే అయి ఉంటాయి. వాటి సెట్టింగులను కూడా పరికరాలను ఉత్పత్తి చేసిన కంపెనీవాళ్లే అమర్చుతారు. వీటి ద్వారా దర్యాప్తు అధికారులు తమకు కావాలనుకున్న నంబర్ల సంభాషణలను రికార్డుచేస్తారు. ఇలా రికార్డు చేసే ఒక్కో సర్వర్ ఖరీదు రూ.10-15 లక్షలదాకా ఉంటుంది. చట్టబద్ధంగా సీబీఐ, రా, ఐబీ, ఈడీ, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఆదాయపన్ను విభాగం, రాష్ట్ర పోలీసు విభాగం అధికారులు మాత్రమే వీటిద్వారా ట్యాపింగ్ చేయడానికి అధికారం కలిగి ఉంటారు.
చట్టవిరుద్ధంగా ఎలా చేస్తారు..?
చట్టబద్ధంగా చేయాలంటే అన్ని పరికరాలు సమకూర్చుకోవాలి. కానీ, చట్టవ్యతిరేకంగా చేయాలంటే అన్ని పరికరాలు, యంత్ర సామాగ్రి అక్కర్లేదు. ల్యాప్టాప్ పరిమాణంలో ఉండే ఒక ఫోన్ ఇంటర్సెప్షన్ మిషన్ను కారులో ఉంచి, ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలో వాళ్ల ఇల్లు లేదా ఆఫీసు సమీపంలో పార్క్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయాల్సిన నంబర్ను మిషన్లోకి ఫీడ్ చేస్తారు. వాళ్లకు ఎప్పుడు కాల్ వచ్చినా, కాల్ వెళ్లినా వెంటనే అది రికార్డయిపోతుంది. ఈ మిషన్లను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి మిషన్లను ఉపయోగించి ట్యాప్ చేసినట్లు బయటపడితే.. టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26(బి) ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశముంది.