శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2015 (12:52 IST)

ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కడ.. ఎలా మొదలయ్యింది..?

ఎర్రచందనం స్మగ్లింగ్ కు చిత్తూరు జిల్లాలోని నాగపట్ల అడవి సింహద్వారాం. దశాబ్దాల కిందటే ఇక్కడ నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా అయ్యేది. ఎక్కడికి తీసుకెళ్ళాతారు. ఎలా స్మగ్లింగ్ అవుతుందనే అంశాలను చూస్తే, గతంలో చెన్నయ్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్ళుతుండేది కానీ, ప్రస్తుతం దారులు చాలా పెరిగిపోయాయి. ఎయిర్‌పోర్టుల ద్వారా కూడా రవాణా అవుతోంది. 
 
చరిత్రలోకి వెళితే చెన్నై పోర్టు నుంచి రేణిగుంట, కడప, కర్నూలుల మీదుగా హైదరాబాద్ లోని నిజాం సంస్థానానికి చేరేది. అయితే 18 శతాబ్దం మొదట్లో ఈస్టిండియా కంపెనీ భారతదేశానికి వచ్చిన తరువాత రైల్వే లైన్లపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా లైన్ల ఏర్పాటు కోసం ఎర్రచందనం కొయ్యను వినియోగించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సిమెంటు దిమ్మెల స్థానంలో ఎర్రచందనం కొయ్యలను వినియోగించే వారు. అంటే ఆ కొయ్య పటిష్టత అంతగా ఉండేది. అందుకోసం అడవుల్లో దాదాపుగా 60 కి.మీ. వరకూ అడవుల్లో ఎడ్ల బండ్ల కోసం దారులు ఏర్పాటు చేశారు. ఎడ్ల బండ్ల ద్వారానే ఈ కొయ్యలను తీసుకెళ్లి రైల్వే లైను తయారు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటినే లండన్ కు కూడా తరలించారు. 
 
ఇక అలా చరిత్రను వదిలేసి నేరుగా వర్తమానంలోకి వస్తే వీరప్పన్ మాట చెప్పుకోక తప్పదు. వేలాది మంది కూలీలలో వీరప్పన్ చందనం స్మగ్లర్‌గా మారారు. ఇటు తమిళనాడు, కర్నాటక, కేరళ అడవుల్లో స్మగ్లింగ్ కింగ్‌లా మారారు. ప్రభుత్వాలకు సవాల్‌గా నిలిచారు. ఇందులో భాగంగా వంశపారంపర్యంగా వచ్చే ఉడ్ కట్టర్లు తయారయ్యారు. వీరందరూ జవ్వాది మలై , జవ్వాది కొండ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. తమిళనాడులోని తిరునల్వేలి, ధర్మపురి ప్రాంతాలకు చెందిన వీరు మెల్లగా శేషాచల కొండల వైపు మళ్ళారు. కారణం బతకడానికి ఇదో సులభమైన మార్గం. సంపాదనకు వక్రమార్గం. స్మగ్లర్లు వీరిని ఇటు వైపు మళ్ళించారు. 
 
చిత్తూరు జిల్లాలోని చిన్నచిన్న నాయకులు, వుడ్ కట్టర్లు స్మగ్లర్లుగా మారిపోయారు. కొందరు యువత పెద్ద పెద్ద నాయకులు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ వైపు మళ్ళారు. మొదట్లో రేషన్ బియ్యం, చక్కెర, కిరోసిన్, పెట్రోల్, కొన్ని సార్లు కూరగాయలను ఇటు వైపు నుంచి అటు వైపుకు,  అటువైపు నుంచి ఇటు వైపుకు అక్రమ రవాణా చేసే చిత్తూరు, పలమనేరు, నగరి, జిడీ నెల్లూరు ఏకాంబర కుప్పం ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్ రుచి మరిగారు. వీళ్లు తమిళనాడు నుంచి వీరప్పన్ ప్రభావిత ప్రాంతాలలోని ప్రొఫెషనల్ వుడ్ కట్టర్లను రంగంలోకి దింపారు. వారినే ఎన్నుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. 
 
వారు చెట్లు నరకడం, డ్రెస్సింగ్ చేయడంలో దిట్టలు కాబట్టి వారిని ఎన్నుకుని శేషాచలం వైపు మళ్ళించారు. ధర్మపురి, ఊటి, జవ్వాది మలై.. పోరూరు ప్రాంతాలను నుంచి వారిని అధిక కూలీ రేట్లకు తీసుకు రావడం మొదలుపెట్టారు. పలుమార్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మగ్లింగ్ అరికట్టడానికి తమిళనాడులోని రాయవేలూరు, తదితర ప్రాంతాలలో అవగాహనా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. అయినా స్మగ్లింగ్ కార్యక్రమాలను అరికట్టలేకపోయారు. దీంతో భారీ ఎన్‌కౌంటర్ లాంటి కార్యక్రమాలకు దిగక తప్పని పరిస్థితి పోలీసుల ముందు నిలబడిందనేది ఓ వాదన.