శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2016 (13:31 IST)

మోదీ 'మన్నార్‌గుడి' మాఫియా తోక కట్ చేస్తారా? తితిదే సభ్యుడిపై ఐటీ దాడితో ఫస్ట్ వార్నింగా?

మాజీ ముఖ్యమంత్రి జయలలిత అలా అస్తమించగానే ఆమె పీఠం కోసం పితలాటకం జరుగుతోంది. పోయెస్ గార్డెన్ పేరు చెప్పగానే అమ్మ జయలలిత గుర్తుకువస్తారు. ఇప్పుడా పోయెస్ గార్డెన్‌లో మన్నార్‌గుడి మాఫియా తిష్ట వేసిందంటూ త

మాజీ ముఖ్యమంత్రి జయలలిత అలా అస్తమించగానే ఆమె పీఠం కోసం పితలాటకం జరుగుతోంది. పోయెస్ గార్డెన్ పేరు చెప్పగానే అమ్మ జయలలిత గుర్తుకువస్తారు. ఇప్పుడా పోయెస్ గార్డెన్‌లో మన్నార్‌గుడి మాఫియా తిష్ట వేసిందంటూ తమిళనాడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. శశికళతో పాటు.. ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, ఇళవరసి, ఆమె కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లుళ్లు వెంకటేష్, మాధవన్, ఆమె మేనకోడలి భర్త శివకుమార్‌లు ఉన్నారు. వీరినే 'మన్నార్గుడి మాఫియా' అని రాష్ట్ర వాసులు పిలుస్తుంటారు. శశికళ సొంత ఊరైన తిరువూరు జిల్లా మన్నార్గుడి పేరు మీద, ఆమె బంధువర్గాన్ని ఈ పేరుతో ఉదహరిస్తారు.
 
పోయస్ గార్డెన్‌లోని వేద నిలయంకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఎందుకంటే... ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సొంత ఇల్లు. ఈ ఇంట్లోకి అనుమతి లేనిదే చీమ కూడా వెళ్లడానికి లేదు. అలాంటిది.. జయలలిత భూమాత ఒడిలోకి చేరుకోగానే మన్నార్గుడి మాఫియా తిష్ట వేసింది. ఈ మాఫియాను  జయలలిత దూరం పెట్టారు. కానీ, ఆమె విశ్రమించగానే అమ్మ ప్రియ నెచ్చెలి శశికళ ఈ మాఫియాకు ఘన స్వాగతం పలికింది. దీంతో ఈ మాఫియా వేద నిలయంలో తిష్టవేసింది. 
 
ఈ మాఫియా ఇప్పుడు జయలలిత నివాసం వేద నిలయంలో చేరింది. జయలలిత గతంలో వీరిలో కొందరిని దగ్గర చేర్చుకున్నప్పటికీ, ఆపై జరిగిన పరిణామాలు, వీరి మనస్తత్వం తెలుసుకున్న ఆమె అందరినీ దూరం పెట్టింది. దీనికి కారణం అప్పట్లో తెహల్కా బయటపెట్టిన ఉదంతమే. ఆంతరంగికులు కొందరు జయను హత్య చేసేందుకు పన్నాగం పన్నారనీ, ఆమెకు స్లో పాయిజన్ ఇవ్వడం ద్వారా ఆ పని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెహల్కా తెలిపింది. అంతేకాదు... ఈ వ్యవహారం తెలుసుకున్న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఈ విషయంపై జయలలితను హెచ్చరించినట్లు కూడా తెలియజేసింది. 
 
విషయం తెలుసుకున్న జయ తనకు నిద్రమాత్రలు ఇచ్చే నర్సు తెస్తున్న మందులపై నివేదిక తెప్పించుకున్నదనీ, ఆ నివేదికలో తెహల్కా చెప్పినట్లే కొన్ని రసాయనాలు ఉన్నట్లు బహిర్గతమైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనితో శశికళతో పాటు ఇతర వ్యక్తులందరినీ జయలలిత దూరం పెట్టారు. ఐతే ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో మళ్లీ శశికళ జయలలితకు దగ్గరయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ తర్వాత జయ అనారోగ్యం పాలవడంతో అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఐతే ఆసుపత్రిలో శశికళ తనదైన రాజకీయ నడిపారని అంటున్నారు. లోపల ఏం జరుగుతుందన్నది బయటి ప్రపంచానికి తెలియకుండా నొక్కిపట్టారనీ, జయలలిత తన ఫోటోలను విడుదల చేయాలని గట్టిగా ఒత్తిడి చేసినప్పటికీ అందుకు శశికళ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తమ్మీద శశికళ ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి తీరుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇదిలావుంటే... శశికళ అండ్ కో వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఇందులో భాగంగానే శశికళ, ఆమె భర్త నటరాజన్‌లకు బినామీ అంటూ ఆరోపణలున్న శేఖర్ రెడ్డిపై ఆదాయపన్ను శాఖ దాడులతో మన్నార్ గుడి మాఫియాకు జర్క్ ఇచ్చారనీ, తోక జాడిస్తే వరసబెట్టి అందరివీ కత్తిరించి పారేస్తారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. బుద్ధిగా పాలన చేస్తే సరి... లేదంటే వెనుకాముందు చూడకుండా చర్యలు తీసుకునేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. మరి శశికళ అండ్ కో ఏం చేస్తారో చూడాలి.