శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శుక్రవారం, 26 అక్టోబరు 2018 (19:38 IST)

ఆనాడు ఎన్టీఆర్ మీద కత్తితో దాడి జరిగింది... పక్కనే చంద్రబాబు ఉన్నారు..?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవ్యం నందమూరి తారక రామారావు (ఎన్‌టిఆర్‌)పైన 1984లో ఓ వ్యక్తి కత్తి విసిరి గాయపరిచాడు. ఆనాడు ఈ ఘటన సంచలనమయింది. ఆ తరువాత కత్తి విసిరిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ ఉదంతంలో అనేక ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. నాటి విశేషాలను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఎన్‌టిఆర్‌పైన కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, ఎవరి పాత్ర ఏమిటి… 
 
9 జనవరి 1984... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఆ రోజుకి సంవత్సరం గడిచింది. ఎన్టీ రామారావు దానిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చెయ్యాలని భావించారు. ఆయన ఆలోచనలకు తగ్గట్లు గానే హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ముందు వరుసల్లో పెద్ద నాయకులు, మంత్రులు ఆశీనులయ్యారు. అన్నిటికన్నా ముందు వరసలో గవర్నర్, రామారావు, నాదెండ్ల భాస్కర రావు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఎదురుగా ఉన్న స్టేజీ మీద కళాకారులు నృత్యాలు చేస్తున్నారు. ఇంతలో సడెన్‌గా “ఇందిరాగాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్” అంటూ అరుపులు వినపడ్డాయి. 
 
అందరు తలతిప్పి చూసే లోగానే చిన్నపాటి కత్తితో ఎన్టీఆర్ మీద దాడి చేసాడు ఓ వ్యక్తి. అందరు అతన్ని పట్టుకునేలోపే ఎన్టీఆర్ బొటన వేలుకి గాయం అయింది. ఎన్టీఆర్ అదేమీ లెక్క చెయ్యకుండా స్టేజీ మీదకు వెళ్లి కళాకారులను అభినందించి, “కాంగ్రెస్ వాళ్ళు నన్ను చంపాలని చూసారు, దేవుడు కాపాడాడు” అని ఒక ప్రకటన ఇచ్చి తిన్నగా ఇంటికి వెళ్లి, చేతికి చిన్న నిమ్మకాయ ముక్క ఒకటి కట్టుకున్నారు (అక్కడున్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు, హాస్పిటల్‌కి వెళ్ళలేదు). తర్వాత నాదెండ్ల భాస్కరరావు బలవంతం మీద నిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌కి చూపించుకొన్నారు.
 
ఆ దాడి చేసిన వ్యక్తి పేరు మల్లెల బాబ్జి. అప్పటికే నాదెండ్ల, కొత్తగా పార్టీలోకి వచ్చిన చంద్రబాబు మధ్య విభేదాలు ఉండటంతో, నిందితుడుది కూడా గుంటూరు జిల్లా అవ్వటంతో ఈ హత్యాయత్నం వెనక నాదెండ్ల హస్తం కూడా ఉందని కేసు పెట్టాలని ప్రయత్నించారనే వాదనలు వచ్చాయి. కానీ, పార్టీలో కొంతమంది పెద్దలు దీనికి అంగీకరించక పోవటంతో కేవలం మల్లెల బాబ్జి మీద కేసు పెట్టారు. కోర్టులో ఇది చిన్న విషయమని, నిందితుడ్ని క్షమించి వదిలెయ్యమని ఎన్టీఆర్ కోరారు.
 
కానీ, కొన్నాళ్ళకు అదో సంచలనం కోసం ఓ నాయకుడు ఆడిన నాటకమనే వార్తలు వచ్చాయి. ఇదిలావుండగానే కొన్నాళ్ల తర్వాత నిందితుడు విజయవాడ లాడ్జీలో నవంబర్ 30, 1987 న ఆత్మహత్య చేసుకోవటంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అప్పుడు వంగవీటి మోహనరంగా ఆధ్వర్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దీనిమీద విచారణ జరిపించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యటంతో జస్టిస్ శ్రీరాములు నేతృత్వంలో విచారణ కమిటీ వేశారు. ఆ విచారణలో మల్లెల బాబ్జి గదిలో దొరికిన రెండు లేఖల్లో సంచలన వివరాలున్నట్లు తేలింది. వాటిని విజయవాడ కోర్టుకి సమర్పించారు. నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసుపై చర్చ జరగలేదు.