శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2016 (15:01 IST)

మిషన్ భగీరథ అంటే ఏమిటి?

దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది. ఇంటింటికీ నీరందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్

దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది. ఇంటింటికీ నీరందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం, ఉద్యమస్ఫూర్తితో కేవలం 9 నెలల అత్యల్ప వ్యవధిలోనే మిషన్ భగీరథ తొలిదశ పనులు పూర్తి చేసి తెలంగాణ సత్తా చాటి చెప్పింది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు.
 
మిషన్ భగీరథ కింద గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. నియోజకవర్గంలో 6 మండలాల పరిధిలోని 243 హెబిటేషన్లు, 5 ఎస్సీ ఆవాసాలు, 10 ఎస్టీ ఆవాసాలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలోని సుమారు 78 వేల కుటుంబాలకు నల్లా ద్వారా తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. మొత్తం 969 కి.మీ విస్తీర్ణంలో 6 మండలాలను, 1 మున్సిపాలిటీని కవర్ చేస్తారు. నియోజకవర్గం లో 78 గ్రామీణ ప్రాంతాలు, 67 పట్టణ ప్రాంతాల్లో 3.35 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు లభించనుంది. 
 
గ్రామీణ ప్రాంత ప్రజలకు 100 ఎల్‌పీసీడీ, పట్టణ ప్రాంత ప్రజలకు 150 ఎల్‌పీసీడీ నీటిని సరఫరా చేస్తారు. ఈ పథకం అమలు చేయడం కోసం 417 విలేజ్ ట్యాంకులు, 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, ఒక గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను, 417 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు. మొత్తం 1402 కి.మీ పైప్‌లైన్ నెట్‌వర్క్ గల ఈ పథకానికి 479 కి.మీ ట్రాన్స్‌మిషన్ పైప్‌లైన్, 923 డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. 
 
ఈ ప్రాజెక్టు నిర్వహణకు 1.8 మెగావాట్ల విద్యుత్ వినియోగించేందుకు సబ్‌స్టేషన్లను సిద్ధపరిచారు. నీటిని హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ పైప్ లైన్ నుంచి వెళ్లే గోదావరి జలాల నుంచి తీసుకుంటున్నారు. మొత్తం రూ.1029.06 కోట్లు ఖర్చు కాగల ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థ వ్యాప్కోస్ రూపకల్పన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ పథకాన్ని ప్రారంభించి సర్వే, డిజైన్,డీపీఆర్ రూపకల్పన చేసుకుంది.