శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (13:20 IST)

టీడీపీకి నారా లోకేష్-టీఆర్ఎస్‌కు కేటీఆర్ అధ్యక్షులైతే?

ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణ రాష్ట్రాల్లో అధికార పార్టీల అధినేతలు మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు నారా లోకేష్ బాబు, ఇటు కల్వకుంట్ల తారక రామారావు ఇరువూరూ.. తమ తండ్రు ఆధ్వర్యంలో ఉన్న పార్టీలకు అధినేతలు కాబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  
 
ఈ ఇద్దరూ దాదాపు ఒకేసారి తమ తమ పార్టీల పగ్గాలను స్వీకరించనున్నారని సమాచారం. తను తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్నందున పార్టీని తన తనయుడు కేటీఆర్‌కు అప్పజెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు.
 
ఇక చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్నందువల్ల టీడీపీ పగ్గాలు అతి త్వరలో లోకేష్ చేతిలోకి రానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పరిణామాలూ చాలా త్వరగా జరగనున్నాయని.. దాదాపు రెండూ ఒకేసారి జరుగుతయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  
 
ఇప్పటికే లోకేష్ అటు పార్టీపైన, ప్రభుత్వంపైనా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏకంగా మంత్రులను పిలిపించుకొని సమీక్షలు నిర్వహించేంత స్థాయికి ఎదిగారు. అధికారికంగా ఏ హోదాలో లేనప్పటికీ లోకేష్ ఈ విధంగా సమీక్షలు నిర్వహించేయడం, ఆయనకు మంత్రులంతా సలాం కొట్టేయడం వంటివి జరిగిపోతున్నాయి. 
 
ఇక కేటీఆర్ ఇప్పటికే మంత్రి హోదాలో ఉన్నాడు. టీఆర్ఎస్ శ్రేణులతో టచ్‌లో ఉన్నాడు. అసెంబ్లీలో పార్టీ వాయిస్‌ను వినిపించే బాధ్యత కేటీఆర్ తీసుకొన్నారు. ఇప్పుడు మంత్రి కూడా కావడంతో ఆయనకు పార్టీపై మరింత పట్టు పెరిగే ఉంటుంది. మరి స్థూలంగా ఈ ఇద్దరు వారసులూ ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు. భారత ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలకు తిరుగులేదన్న వాస్తవాన్ని చాటుతున్నారు.
 
ఇలా తెలంగాణ, ఏపీల్లో టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలను పటిష్టపరిచేందుకే అధ్యక్ష పగ్గాలను యువనేతల చేతికి అప్పగించాలని ఆయా రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారని, తద్వారా తదుపరి ఎన్నికల్లోపు వారినే సీఎం అభ్యర్థులుగా నిలబెట్టి.. విజయం సాధించేలా చేయాలని చంద్రబాబు, కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ పండితులు అంటున్నారు.