శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (16:45 IST)

చంద్రబాబు మారిపోయారా? అందుకే ఓ మెట్టు దిగారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మారిపోయారా? ఇదే అంశంపై టీడీపీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆయన మారడం వల్లే నాగార్జున సాగర్ జల వివాదం టీ కప్పులో తుఫానులా సమిసిపోయిందని వారంటున్నారు. 
 
ముఖ్యంగా ఇంతకాలం తెలంగాణ వ్యవహారంపై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఆయనకున్న వైఖరిని మార్చుకున్నట్లు ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. ఉన్నట్టుండి తనలో మార్పు ఎందుకు తెచ్చుకున్నారన్నది పక్కన బెడితే ఇది తెలుగువారి ప్రయోజనాలకు మేలు చేకూరుస్తుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
 
గతంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలోనూ. విద్యుత్ కేటాయింపుల్లోనూ, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలవివాదాల విషయంలోనూ చంద్రబాబు సామరస్యపూరిత ధోరణిని కాకుండా, కాస్తంత దూకుడుగా వ్యవహిస్తూ మొండి తనాన్ని ప్రదర్శించారు. కానీ, నాగార్జున సాగర్ జల వివాదం విషయంలో ఆయన మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. తానే ఓ మెట్టుదిగి కేసీఆర్‌కు ఫోన్ చేయడం, మరుసటి రోజు గవర్నర్ సమక్షంలో సమస్యకు పరిష్కారం కనుగొనటం అన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. 
 
అంతేకాకుండా, తాజాగా తన ఏడు మిషన్ల వ్యవహారంపై అధికారులు, తదితరులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు వాఖ్యలు ఈ మార్పును సూచించాయి. నిధుల కోసం భయపడొద్దు, కేంద్రం నుంచి నిధులు తెస్తాను. అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసి కేంద్రం వద్దకు వెళ్లి నిధులు సాధిస్తాను. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుంటాం అన్నట్టు వినికిడి. 
 
చంద్రబాబులో ఈ తరహా మార్పునకు కారణాలు అనేకం అన్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. కేంద్రం తమ పట్ల అనుసరిస్తున్న వైఖరితో విసుగు చెందిన చెందిన చంద్రన్న... ఎలుకా, పిల్లి గొడవలో మధ్యలో పెద్ద మనిషిగా చేరిన కోతి బాగుపడ్డట్టు తెలుగు వాళ్లం గొడవ పెట్టుకుంటే మధ్యలో కేంద్రం లబ్దిపొందుతోందని, ఇది ఇద్దరికీ నష్టమని భావించినట్టు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు మారినట్టు టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.